
సీఎం జగన్, చంద్రబాబు ఒకే చోట – ప్రతిష్ఠాత్మకం, ఉత్కంఠ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఈ సమయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పర్యటనకు ఒకే రోజున రానున్నారు..
ఇద్దరూ ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల పర్యటనల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక కానుంది..
పోలవరంలో ఇద్దరు నేతలు:
సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు (సోమవారం) పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో బస చేయనున్నారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట కొద్ది రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం (అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు..



