దూకుడు పెంచిన టీ కాంగ్రెస్
హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. టాప్ గేర్లో దూసుకెళ్తోంది. అయితే, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కూడా వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు నియోజకవర్గాల వారీగా ఆశవాహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతోన్న కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వరుస డిక్లరేషన్లు ప్రకటిస్తో్ంది. ముందు, వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్, ఈమధ్యే హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేసింది. ఇక, ఇప్పుడు మరో డిక్లరేషన్ని రెడీ అవుతోంది టీకాంగ్రెస్. అత్యధిక జనాభా కలిగిన బీసీలను ఆకట్టుకునేందుకు ప్రజాకర్షక పథకాలకు రూపకల్పన చేస్తోంది. రైతు డిక్లరేషన్ను రాహుల్గాంధీ ప్రకటిస్తే, యూత్ డిక్లరేషన్ను ప్రియాంకా గాంధీ చేత అనౌన్స్ చేయించారు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ను… బీసీ నేత, కర్నాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్ గురించి ఆయనకు వివరించి ఆహ్వానించారు. బీసీ డిక్లరేషన్ కోసం ఇప్పటికే డ్రాఫ్ట్ పూర్తి చేశామని కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, వీహెచ్ హనుమంతరావు వివరించారు. ఇంకా అందులో పొందుపరచాల్సిన విషయాలను కూడా ఆయనతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆహ్వానానికి సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారు. అయితే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య …డేట్ ఇవ్వగానే బీసీ డిక్లరేషన్ సభ తేదీని ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వెల్లడించారు.ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే. కర్ణాటక గెలుపుతో జోష్ లో ఉన్న హస్తం పార్టీ.. అక్కడ అవలంభించిన వ్యూహాలనే.. తెలంగాణలో అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ టీం కర్ణాటక సీఎంను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.




