హిమాచల్ లో భారీ వరదలు
సిమ్లా, ఆగస్టు 28: హిమాచల్ ప్రదేశ్ పై వరుణుడు పగపట్టినట్లుగా కనిపిస్తోంది. గంటలు కాదు, రోజులు కాదు, వారాల తరబడి భారీ వర్షాలతో ఆ రాష్ట్రంపై విశ్వరూపం చూపిస్తున్నాడు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి ప్రకోపాల ధాటికి కులు సహా అనేక ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలుతున్నాయి. జూలై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. 113 చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. అటు మండి జిల్లాలోని క్లౌడ్బర్స్ట్ కారణంగా చిక్కుకు పోయిన 51 మందిని NDRF బృందాలు రక్షించాయి. భారీ వర్షాలకు విద్యుత్ లైన్లు దెబ్బ తినడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొండ చరియలు విరిగి పడి కులు-మండి హైవే పై వందలాది మంది నిలిచి పోయారు. హైవే పై చిక్కుకున్న వారిని హోటళ్లు, రెస్టారెంట్లు, నివాస సముదాయాల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు తరలించారు. ఆగస్ట్ 29 వరకూ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో అధికారులు అంతా అప్రమత్తమయ్యారు. వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, విద్యాసంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇంకా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో 729 రహదారులను మూసివేశారు.




