హైదరాబాద్: పొత్తులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక వార్తలపై మీడియా సంయమనం పాటించాలని కోరారు.
‘‘అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్కు ఓ విధానం ఉంది. అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారవుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నాం. కాంగ్రెస్ నేతలకు ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పదవులు.. ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పకుండా గుర్తించి గౌరవిస్తాం.
కొందరు ఐఏఎస్ అధికారులు భారాస కోసం పనిచేస్తున్నారు. అనేక హోదాల్లో రిటైరైన వారిని భారాస కోసం పనిచేసే అధికారులు మోహరించారు. భారాస అనుకూల అధికారుల వివరాల సేకరణకు కమిటీని నియమిస్తున్నాం. కాంగ్రెస్పై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటాం. పింఛన్లు తప్ప కోడ్ అమల్లోకి వచ్చాక ఓటర్లకు నిధులు విడుదల చేయకూడదు. ఐఏఎస్ల నుంచి ఎమ్మార్వో వరకు కొందరు అధికారులు.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు’’ అని రేవంత్రెడ్డి ఆరోపించారు.



