డాక్టర్ అనిల కుమారి
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (వాయిస్ టుడే ప్రతినిధి): తృణధాన్యాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల కుమారి అన్నారు. ప్రతి ఒక్కరూ తృణధాన్యాలను తమ ఆహారంలో చేర్చుకోవాలని సూచించారు. 78వ ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఓయూ ప్రధాన గ్రంథాలయం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ (హెచ్సీడీసీ) సంయుక్తంగా హెచ్సీడీసీ ఈ క్లాస్ రూమ్లో వేడుకలను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి దినోత్సవ ఈ సంవత్సరం థీమ్ అయిన ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ అనే అంశంపై డాక్టర్ అనిల కుమారి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో తృణధాన్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు. తృణధాన్యాలను క్రమం తప్పక తీసుకునేవారు ఆనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉండబోవన్నారు. ఇప్పుడిప్పుడే తృణధాన్యాలపై ప్రజల్లో అవగాహన కలుగుతోందని అభిప్రాయపడ్డారు. తృణధాన్యాలతో ప్రయోజనాలను ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వేడుకలకు ముందు ఓయూ లైరీలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ ఏఎస్ చక్రవర్తి, అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ ఎస్. యాదగిరి, హెచ్సీడీసీ డైరెక్టర్ ప్రొఫెసర్ సీవీ రంజని, లైబ్రెరీ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.



