సత్తుపల్లి బీజేపీ అభ్యర్థి రామలింగేశ్వరరావు
మూడో జాబితాలో వెల్లడించిన బీజేపీ
మొత్తం 35 సీట్లకు అభ్యర్థుల ప్రకటన
నియోజకవర్గంలో బీజేపీకి తగిన ఆదరణ

ఫలితంపై ప్రభావం చూపగల స్థాయిలో ఓట్లు
నేడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలే అవకాశం
(వాయిస్ టుడే-తల్లాడ)
సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టికెట్ ఇవ్వగా.. తాజాగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. రామలింగేశ్వరరావును సత్తుపల్లి నుంచి బరిలో దింపనున్నట్లు వెల్లడించింది. గురువారం 35 మంది అభ్యర్థులతో బీజేపీ అధిష్ఠానం మూడో జాబితాను ప్రకటించింది. ఇందులోనే రామలింగేశ్వరరావుకు చోటు దక్కింది.
ఆదరణ ఉంది.. కానీ,
సత్తుపల్లి నియోజకవర్గంలో బీజేపీకి తగిన ఆదరణ ఉంది. కానీ, దానిని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలోనే ఆ పార్టీ విఫలం అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు మండలాల్లోనూ బీజేపీ పట్ల అభిమానం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల విశ్వాసం ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికలతో పోలిస్తే సత్తుపల్లి నియోజకవర్గంలో కాషాయ పార్టీకి బలం పెరిగింది. ఫలితంపై ప్రభావం చూపగల స్థాయిలో ఓట్లు ఉన్నాయి. దీనిని ఈసారైనా అందిపుచ్చుకుని ఓట్లుగా మలుచుకుంటుందో లేదో చూడాలి.
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలుస్తారా?
సత్తుపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరో ఇప్పటికే స్పష్టమైంది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేది ఎవరో తేలాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ టికెట్ కు నలుగురు నాయకులు పోటీ పడుతుండంతో ఎవరికి దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 19 స్థానాలకు టికెట్లను పెండింగ్ లో పెట్టగా అందులో నాలుగు ఉమ్మడి ఖమ్మంలోనివే కావడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్ సత్తుపల్లి అభ్యర్థిని గురువారం ప్రకటిస్తుందనే కథనాలు వస్తున్నాయి. మరి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, ఓయూ ఉద్యమ నేత మానవతా రాయ్, కొండూరు సుధాకర్, గతంలో పోటీ చేసిన మట్టా దయానంద్ లో ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.



