కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సూర్యాపేట నవంబర్ 10: కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ను ఓడించేందుకే తనకు టిక్కెట్ ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. సూర్యాపేటలో గెలిచేది రమేష్ రెడ్డి అని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని, సర్వేల్లో కూడా ఇదే తేలిందని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన ప్రకటించారు.2018 ఎన్నికల్లో జరిగిందే మళ్లీ రీపీట్ అయ్యిందని, కొందరు జిల్లా సీనియర్ నేతల వైఖరి కారణంగా టిక్కెట్ చేజారిందని ఆయన వాపోయారు. ఇన్నాళ్లు పార్టీని కాపాడుకున్నా ఫలితం దక్కలేదని అన్నారు. అంతకుముందు సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదరరెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ గురువారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు హైదరాబాద్ విజయవాడ రహదారిపై జనగాం క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.ఆందోళన చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. వరుసగా రెండోసారి టిక్కెట్ ఆశించి భంగపడడంతో రమేష్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఆయన సతీమణి లావణ్య రెడ్డి భోరున విలపించారు. పార్టీ కోసం రాత్రీ పగలు కష్టపడితే పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు, ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు రమేష్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



