ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాము
పెద్దపల్లి: నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆయన అసెంబ్లీలో ప్రమాణస్వీకార అనంతరం తొలిసారిగా పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గర్రెపల్లి గ్రామం నుండి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపెడతానని పేర్కొన్నారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలకు అందే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 2 గ్యారంటీలను అమలు చేశారన్నారు. 100 రోజుల్లో మిగతా 4 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హామీ ఇచ్చాము… అమలు చేస్తున్నాము
పెద్దపల్లి: తమ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రెండు పథకాలు అమలు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. హైదరాబాద్ నుండి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన పెద్దపల్లికి తొలిసారి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేను గజ మాలతో సత్కరించి, గర్రెపల్లి నుండి బైక్ ర్యాలీ తీసారు. పేరు పేరునా ప్రతి ఒక్కరికి తన గెలుపులో సహకారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన మహాలక్ష్మి పథకం ద్వారా ప్రవేశ పెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఆయన అధికారులు, మహిళలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారని తదుపరి పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్టీసి బస్ స్టాండ్ ఆవరణలో ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి మధు మోహన్, తహసీల్దార్ రాజకుమార్, మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



