
హైదరాబాద్, జనవరి 7 :: గత నెల 28 తేదీనుండి ఈనెల 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన లో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సోమవారం నాడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ప్రజాపాలనలో మొత్తం1,25,84,383 దరఖాస్తులు
ప్రజాపాలనా జరిగిన పదిరోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారేటీలకు సంబంధించి 1,05,91,636 దరకాస్తులు కాగా, ఇతర అభ్యర్ధనలకు సంబంధించి 19 ,92 ,747 ఉన్నాయి. రాష్ట్రంలోని 16 , 392 గ్రామ పంచాయితీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1 ,11 ,46 ,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3 ,714 అధికార బృందాలు పాల్గొని దరఖాస్తుల స్వీకరణకు 44 ,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ ఎంసీ లోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణాధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఈ ధరఖాస్తులన్నిటిని జనవరి 17వ తేదీ లోగా డేటా ఎంట్రీ ని పూర్తి చేయాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు.



