హైదరాబాద్: మీ వద్ద రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే ఎన్నికల అధికారులు లేదా పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉంది. వెండి, బంగారు ఆభరణాలు పెద్దమొత్తంలో ఉన్నా.. స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(కోడ్) అమల్లోకి వచ్చింది.
అత్యవసరాలకు ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించిన రసీదులు (బ్యాంకు నుంచి తీసుకున్నవి, చెల్లింపులకు సంబంధించిన పత్రాలు) వెంట పెట్టుకోవాలి. దుకాణాలలో సరకులకు చెల్లించే మొత్తం అయితే ముందస్తు అనుమతి పత్రం(కొటేషన్) ఉండాలి. నగలకు సంబంధించి ఆర్డర్ కాపీ, తరలింపు పత్రం తప్పనిసరి. బ్యాంకులు, నగదు రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాలకు సూర్యాస్తమయంలోపే కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తారు. ఆసుపత్రుల్లో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపీ పత్రాలు, రసీదులు వెంట ఉంచుకోవాలి. పోలీసులు, ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు. జిల్లా పరిషత్ సీఈవో నేతృత్వంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు. వారికి తగిన ఆధారాలు చూపి సరైనవని తేలితే నగదు, వస్తువులను వెనక్కి ఇస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
50 వేల కన్నా ఎక్కువ నగదు ఉంటే ఆధారాలు చూపాల్సిందే
- Advertisement -
- Advertisement -



