లోక్ సభ ఎన్నికల్లో… -అవినీతి,హింస నిర్మూలనకు పాత్రికేయులు కృషి చేయాలి
-పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ ఆనంద బోస్
-కోల్ కతాలో ప్రారంభమై ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ సమావేశాలు.
లోక్ సభ ఎన్నికల్లో జర్నలిస్టులు బాధ్యతగా వ్యవహరించి, అవినీతి, హింసలను అరికట్టేందుకు కృషి చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ పిలుపునిచ్చారు. మీడియా వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడిందని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి నిర్మూలనకు పాత్రికేయులు మరింత కృషి చేయాలని కోరారు. ఆదివారం కోల్ కతా లోని ఇండీ స్మార్ట్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో రెండు రోజుల ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) వర్కింగ్ కమిటీ సమావేశాలు, పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ సర్వసభ్య సమావేశాలను గవర్నర్ ఆనంద బోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీపుల్స్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాగా ప్రజల పక్షాన నిలబడిందని అభివర్ణించారు. ఈ సమావేశంలో ఐఎఫ్ డబ్ల్యూజే సెక్రటరీ జనరల్ విపిన్ దులియా, పీటీఐ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ జనరల్ బలరాం సింగ్ దహియా, ఇందుకాంత్ దీక్షిత్, ఎన్ యుజే శర్మ సాహు,ఐఎఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం(తెలంగాణ), వర్కింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, తెలంగాణ ప్రతినిధులు కుడితాడు బాపురావు, బండి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రతినిధులు గవర్నర్ ఆనంద బోస్ ను సన్మానించారు.