పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
The sacrifices of police martyrs are unforgettable
రాచకొండ సి పి సుధీర్ బాబు
అంబర్పేట సిఎఆర్ హెడ్క్వార్టర్స్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ నిర్వహణ
యు రక్తదాన శిబిరం
పోలీసు అమరవీరుల దినోత్సవ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు అక్టోబరు 21న అంబర్పేట సిఎఆర్ హెడ్క్వార్టర్స్లో పోలీసు అమరవీరుల స్మారక స్థూపానికి మరియు, పోలీసు అమరవీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, 21 అక్టోబర్, 1959 లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సేనల ఆకస్మిక దాడిలో ప్రాణాలు అర్పించిన పది మంది సీఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా పోలీసు సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం సంస్మరణ దినాన్ని పోలీసు పతాక దినంగా పాటిస్తున్నామని సీపీ గుర్తు చేశారు.
దేశాన్ని శాంతియుతంగా ఉంచేందుకు వేలాది మంది పోలీసులు తమ జీవితాలను అంకితం చేశారని గుర్తు చేశారు.
రాచకొండ పోలీసుల సంక్షేమం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు, పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ ఆరోగ్య పరీక్షల శిబిరాలు తదితర అనేక భద్రతా చర్యలు చేపట్టామని, రక్తదాన శిబిరాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.
2023 అక్టోబరు 21 నుంచి 27 వరకు రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసు పతాక దినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, ఆన్లైన్ ఓపెన్ హౌస్, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఇతర పౌరులు చురుకుగా పాల్గొనాలని సీపీ సూచించారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రి జోన్ లోని 10 మంది అమరుల కుటుంబ సభ్యులు, ఇబ్రహీంపట్నం డివిజన్ లోని ముగ్గురు కుటుంబ సభ్యులు హాజరై అమరులకు శ్రద్దాంజలి ఘటించారు. అమరుల కుటుంబాలకు సీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారితో మమేకమై, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల అత్యున్నత త్యాగాలను ప్రజలు గుర్తించాలని, సమాజాన్ని నేరరహితంగా ఉంచేందుకు పౌరులు సహకరించాలని సీపీ కోరారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో రాచకొండ పరిధిలోని పోలీసు సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో కృషి చేయాలని కమిషనర్ సూచించారు



