పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ స్థలం విషయంలో న్యాయం చేయండి
Do justice regarding the Panchamukha Anjaneyaswamy temple site.
కరీంనగర్
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ , మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ , విద్యుత్ ఉన్నతాధికారులతో పాటు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన దేవాలయ కమిటీ బాధ్యులు చిందం నరసయ్య, బొంతల కళ్యాణ్ చంద్ర తిమ్మాపూర్ మండలం అలుగునూర్ ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ అలుగునూర్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన స్థలం విషయంలో తగిన న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రోజున పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మకర్తల సేవా సమితి అధ్యక్షులు చిందం నరసయ్య, ప్రధాన కార్యదర్శి బొంతల కళ్యాణ్ చంద్ర లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర కాలనీలో 14 సంవత్సరాల క్రితం పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగిందని, దేవాలయానికి అనుబంధంగా రామ సాయి దేవాలయం, ఆదిత్యాది నవగ్రహాధిపతుల మండపం, శివాలయం, విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవ మండప నిర్మాణాలన్నీ దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరిగిందని వివరించారు. దేవాలయ భవిష్యత్తు అవసరాల కోసం అవసరమైన భూమిని కేటాయించాలని గతంలో జిల్లామంత్రులకు , మానకొండూరు శాసన సభ్యులు , గ్రామపంచాయతీ పాలకవర్గానికి, సంబంధిత అధికారులకు విన్నవించి, వినతి పత్రాలు అందించిన క్రమంలో ప్రజా ప్రతినిధుల, అధికారుల ఆదేశానుసారం 2015 సంవత్సరంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి అలుగునూరు గ్రామ పంచాయతీ నుండి అధికారిక నిర్మాణ అనుమతి పత్రాలు కలిగి, దేవాలయానికి ఇంటి నంబరు ను పొంది, దేవాలయ సముదాయంలోని అన్ని నిర్మాణాలకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ ను చట్టబద్ధంగా కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అలుగునూరు విద్యుత్ ఉపకేంద్రం ప్రహరీ గోడ నిర్మాణం కోసం దేవాలయ కి సంబంధించిన కొంత భూమిలో పునాది వేసి , కాంపౌండ్ నిర్మాణం చేయడానికి మార్కింగ్ చేశారని, దేవాలయ గుడిని అనుకుని చేపట్టాలనుకుంటున్న ప్రహరీ గోడ నిర్మాణం వల్ల దేవాలయానికి అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా దేవాలయ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం గుడి చుట్టూ వాహనాలు తిరగడానికి , భక్తులు ప్రదక్షిణ చేయడానికి , ప్రతి ఏటా నాలుగు సార్లు జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు, పూజారి అవసర నిమిత్తం అవసరమైన స్థలం మొత్తం గుడి వెనుక భాగం లో ఉందని, దేవాలయానికి అవసరమైన మేరకు ప్లాను ప్రకారమే స్థలాన్ని దేవాలయం కలిగి ఉందని తెలిపారు. దేవాలయానికి ఉన్న ప్లాన్ ప్రకారం స్థలాన్ని విడిచిపెట్టి , విద్యుత్ సబ్ స్టేషన్ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజావాణిలో అధికారులను కోరారు . అనంతరం దేవాలయ స్థల సమస్య పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు , కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ , టీఎస్ ఎన్పీడీసీఎల్, ఎస్ . ఈ, ఆలుగునూర్ సబ్ స్టేషన్ ఏ .ఈ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.



