స్థానిక సమరానికి బీజేపీ సన్నద్దం.
కరీంనగర్ లో పార్టీ శ్రేణులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశం
బిఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా పార్టీ శ్రేణులకు బండి సంజయ్ దిశా నిర్దేశం
మెజార్టీ స్థానాలు గెలుపే లక్ష్యంగా గల్లిగల్లికి కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను తీసుకెళ్లాలని ఆదేశం
BJP gears up for local battle; Union Minister Bandi Sanjay holds meeting with party cadres in Karimnagar
స్థానిక సంస్థల సమరానికి కమలదళం సన్నద్దమయ్యింది. మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లేలా సిద్ధమైంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సని వ్యూహంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్టీ మండలాధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపే వాళ్లెందరున్నారు? అని అడిగిన ప్రశ్నకు దాదాపు అందరూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని చేతులెత్తారు. ఈ నేపథ్యంలో వాళ్లను ఉద్దేశించి సంజయ్ ప్రసంగిస్తూ స్థానిక సంస్థల్లో వాతావారణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో, ఆ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్ధికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. దానిని దృష్టిలో ఉంచుకని మీ పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు. మిగిలిన వారంతా ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా కసితో పనిచేయాలని కోరారు. మండలాధ్యక్షులు సైతం తమ తమ మండలాల పరిధిలో అత్యధిక సర్పంచ్, వార్డు కౌన్సిలర్ స్థానాలను గెలిపించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. అందుకు తగిన ప్రణాళికను రూపొందించుకుని ఎన్నికల రంగంలోకి దిగాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రచారం చేయాలని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులివ్వకుండా స్థానిక సంస్థలను ఏ విధంగా నీరుగార్చారు….అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులివ్వకుండా ద్రోహం చేసిందనే విషయంతోపాటు 19 నెలల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకుండా, కనీస అభివృద్ధి పనులు చేయకుండా ఏ విధంగా నష్టం చేకూరుస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతోపాటు గత 11 ఏళ్లలో పంచాయతీలు అభివృద్ధి చెందాయంటే నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సాధ్యమైందనే అంశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు. రైతు వేదికలు, పల్లె ప్రక్రుతి వనాలు, సీసీ రోడ్లుసహా స్మశాన వాటికల నిర్మాణం దాకా కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికీ, గల్లీగల్లీకి తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.



