బీఆర్ఎస్ విజయఢంకా మోగించడమే లక్ష్యం –
కొత్తగూడెంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం
వాయిస్ టుడే ,జనవరి 19, 2026
The goal is to make BRS sound the victory drum: MP Vaddiraju Ravichandra

బీఆర్ఎస్ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతుండటాన్ని ఓర్వలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి హింసను ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.
సోమవారం కొత్తగూడెం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పడిన బకాయిలపై రూపొందించిన బాకీ కార్డులు, మునిసిపల్ ఎన్నికల డోర్ స్టిక్కర్లను ఎంపీ రవిచంద్ర విడుదల చేశారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ రవిచంద్ర, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నాయకులు నెరవేర్చలేదని విమర్శించారు.
రైతులకు రూ.76,000 కోట్లు, ఆడబిడ్డలకు రూ.62,500 కోట్లు, వృద్ధులు–దివ్యాంగులకు రూ.50,000 కోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయని తెలిపారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు, పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు.
కౌలురైతులు, ఆటో కార్మికులు, నిరుద్యోగ యువతకు చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ విడుదల చేసిన డోర్ స్టిక్కర్లు, బాకీ కార్డులను గడపగడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం పైగా సర్పంచులను గెలిపించుకున్నామని, అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మొత్తం 60 డివిజన్లలో బీఆర్ఎస్ విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయదలచిన వారు పార్టీ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, సర్వే ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు నిర్ణయించిన నాయకులకే టికెట్లు లభిస్తాయని చెప్పారు.
బీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలకు తావులేదని, అందరూ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు స్టిక్కర్లు, బాకీ కార్డులు, ఓటర్ల జాబితాలు అందజేశారు.
ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”, “వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం”, “జిందాబాద్ బీఆర్ఎస్”, “కారు గుర్తుకే మన ఓటు” నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగింది.



