ఎన్నికల చిత్రాలు…
ప్రత్యక్ష రాజకీయ పోటీగా బంధుత్వాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 7
Election Pictures…
Kinship as Direct Political Competition
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో చాలా విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్లను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా జరుగుతున్న సంఘటనలు చాలా మున్సిపాలిటీల్లో కనిపిస్తున్నాయి. కుటుంబాలు, సంబంధాలు, వయస్సు, పేర్ల సారూప్యత… ఇలా ఎన్నో అంశాలు ఈ ఎన్నికలకు ప్రత్యేక రంగు పులుముతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండో వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులిద్దరి పేర్లు మాత్రమే కాదు… ఇంటిపేర్లు కూడా ఒకటే — బీసోళ్ల సంధ్యారాణి. ఇద్దరి భర్తలు వరుసకు అన్నదమ్ములు కావడం ఇందులో మరింత ట్విస్ట్. దీంతో ఓటర్లు బ్యాలెట్ ముందు కాసేపు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అభ్యర్థుల పేర్ల కంటే పార్టీ గుర్తును గుర్తుంచుకోవాలని రెండు పార్టీలూ తమ ప్రచారంలో పదే పదే చెబుతున్నాయి. ఈ కన్ఫ్యూజన్ చివరికి ఎవరికి లాభం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఇంకో ఆసక్తికర విషయం కనిపిస్తోంది. 83 ఏళ్ల మహిళా రైతు దొండపాటి కాంతమ్మ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ విషయం అక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వయస్సు పెరిగినా ఉత్సాహం తగ్గలేదని నిరూపిస్తూ… వ్యవసాయ పనులతో పాటు ప్రజల మధ్య చురుగ్గా ఉండే ఆమె, ఎనిమిదో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదే మున్సిపాలిటీలో మూడో వార్డులో ఆమె కుమారుడు కూడా పోటీలో ఉండటం కుటుంబ రాజకీయానికి ఓ సింపుల్ ఎగ్జాంపుల్. మిర్యాలగూడలో తండ్రీ–కొడుకులు వేర్వేరు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో నిలవడం కూడా స్థానికంగా చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నాయకులు ప్రజా తీర్పు కోరడం రాజకీయంగా ఆసక్తికర సమీకరణంగా మారింది. దేవరకొండలో అక్కాచెల్లెళ్లు ఎన్నికల రంగంలో నిలవడం మరో హైలైట్. ఐదో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జక్కుల రాజేశ్వరి పోటీ చేస్తుండగా, ఆమె అక్క కొండ్ర మల్లేశ్వరి 20వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గతంలో అదే వార్డులో గెలిచిన మల్లేశ్వరికి ఈసారి పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తోంది. భువనగిరి మున్సిపాలిటీలో అయితే రాజకీయ వ్యూహాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఛైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ప్రధాన పార్టీల నేతలు తాము పోటీ చేయకుండా తమ భార్యలను బరిలోకి దించారు. అధికారం ఇంట్లోనే ఉండాలన్న వ్యూహంతో కుటుంబ సభ్యుల్ని ముందుకు తేవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం 35 వార్డుల్లో 17 మహిళలకు రిజర్వ్ కావడంతో మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.వికారాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవమై.. సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలో చేరింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి.విజయకుమార్ సతీమణి విజయలక్ష్మి 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు. చివరి రోజు పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులచే నామినేషన్లు ఉపసంహరింపజేశారు. దీంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. ఆ కొద్దిసేపటికే భార్యాభర్తలు ఇద్దరూ కనిపించకుండా పోయారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేసినా స్పందించలేదు. ఫోన్లు స్విచాఫ్ చేసుకొని పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు. సాయంత్రానికి వారు కాంగ్రెస్ గూటికి చేరినట్లు వచ్చిన సమాచారం అందింది. దీంతో బీఆర్ఎస్ నేతలు నివ్వెరపోయాయి. ఈ ఎన్నికల్లో మరో స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది. కుటుంబ రాజకీయాల పెరుగుదల. భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, అక్కాచెల్లెళ్లు… ఇలా బంధుత్వాలు ప్రత్యక్ష రాజకీయ పోటీగా మారుతున్నాయి. అదే సమయంలో వృద్ధులు కూడా వెనుకడుగు వేయకుండా పోటీకి దిగడం ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోంది. సో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఈసారి కేవలం ఓట్ల యుద్ధం మాత్రమే కాదు… సంబంధాల రాజకీయాలు, వ్యూహాల ఆట, భావోద్వేగాల పోటీగా మారాయి. పేర్లు ఒకటైనా…. కుటుంబాలు వేర్వేరు అయినా… చివరికి తీర్పు మాత్రం ఓటరుదే. ఈ ఆసక్తికర సమీకరణాల్లో విజయం ఎవరిని వరించబోతోందో చూడాలి.



