బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత
హైదరాబాద్ మార్చ్ 10
Double-bedroom houses must be allotted to victims on Bhoodan land itself: Kavitha
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తాము దీక్ష చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు అని అన్నారు. ఖమ్మంలో దీక్ష చేస్తుండగా అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి కవిత చేరుకుని.. నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 31 ఎకరాల పేదల భూమిని పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి తమ దీక్ష కొనసాగుతూనే ఉందని, బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇళ్లు ఇచ్చి..న్యాయం జరిగేదాకా నిరహార దీక్ష కొనసాగిస్తానని తెలియజేశారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. భూదాన్ భూముల్లోని ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారని, పట్టాలు ఉన్న వారి ఇళ్లను ఎలా తొలగిస్తారు? అని ప్రశ్నించారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నామని తెలిసి కూడా ఇళ్లను తొలగించారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇళ్లంటే లెక్కలేదని ధ్వజమెత్తారు. వెలుగుమట్లలో ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తున్నాం అని కవిత పేర్కొన్నారు.



