దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్
అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
Speaker Gives Clean Chit to Danam Nagender and Kadiyam Srihari
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు నేడు ముగింపు పలికింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ప్రకటించారు. విచారణ అనంతరం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీంతో వారికి పెద్ద ఊరట లభించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువులోగా ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో స్పీకర్ కార్యాలయం తుది తీర్పు వెలువరించింది. మార్చి 12లోపు తీర్పు ఇవ్వాల్సి ఉండగా ఒక రోజు ముందుగానే నిర్ణయాన్ని ప్రకటించారు.
గతంలో మొత్తం పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. అందులో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై వాదనలు పూర్తయ్యాక వారి పిటిషన్లను కూడా డిస్మిస్ చేశారు. దీంతో మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించినట్లైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ దాఖలైంది. అదే విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినందుకు కడియం శ్రీహరిపై కూడా అనర్హత పిటిషన్ దాఖలైంది.
అయితే అన్ని అంశాలను పరిశీలించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.



