జనగణనకు అంతా సిద్ధం
హైదరాబాద్, మార్చి 28, (వాయిస్ టుడే )
Everything is ready for the census.
దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న జనగణన 2027 ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ భారీ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, ఎన్యుమరేటర్లు ప్రజలతో ప్రవర్తించే తీరుపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) కఠినమైన నిబంధనలను విధించింది. ముఖ్యంగా ప్రజలను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేలా లేదా అభ్యంతరకరమైన ప్రశ్నలు వేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిందజనగణన సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రజలను అసంబద్ధమైన, ఇబ్బందికరమైన లేదా అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగే అధికారులకు జైలు శిక్ష తప్పదని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ హెచ్చరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. జనగణన చట్టం ప్రకారం.. విధుల్లో ఉండి ప్రజలను వేధించేలా ప్రవర్తించే అధికారులకు రూ.1,000 జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఆయన గుర్తు చేశారు. నేరం తీవ్రతను బట్టి జరిమానా, శిక్ష, కొన్ని కేసుల్లో రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు.సాధారణంగా జనగణన సమయంలో అధికారులు అడిగే కొన్ని ప్రశ్నలు ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తాయనే ఫిర్యాదులు గతంలో వినిపించాయి. ఈ నేపథ్యంలోనే జనగణన ప్రక్రియ పారదర్శకంగా, హుందాగా సాగాలని కేంద్రం భావిస్తోంది. అధికారులు కేవలం నిర్దేశించిన ఫారమ్లలో ఉన్న ప్రశ్నలను మాత్రమే అడగాలని, వ్యక్తిగత విమర్శలు లేదా అనవసరమైన ఆరా తీయడం వంటివి చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
జనగణన ద్వారా సేకరించిన సమాచారం అత్యంత వ్యక్తిగతమైనదని, దీనిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ముందస్తు అనుమతి లేకుండా.. సేకరించిన సమాచారాన్ని బయటి వ్యక్తులకు లేదా సంస్థలకు బహిర్గతం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. సమాచార గోప్యతను ఉల్లంఘించే అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్జీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.మరోవైపు తొలిసారిగా జనగణనలో కుల గణనను కూడా చేర్చనున్న సర్కారు.. వీటి నిర్వహణ కోసం రూ. 11,718 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. స్వాతంత్ర్యం తర్వాత జరగనున్న 16వ జనాభా గణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుండగా.. పౌరులకు స్వీయ గణన ఎంపికను కూడా అందిస్తోంది.



