హైదరాబాద్లో కాంగ్రెస్ సేవాదళ్ “సమర్థ్” శిక్షణా శిబిరం ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 28: వాయిస్ టుడే
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో “సమర్థ్” పేరిట 6 రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణా శిబిరం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ శిబిరం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు.
ఈ శిబిరంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, బ్లాక్ మరియు మండల అధ్యక్షులు కలిపి సుమారు 350 మందికి శిక్షణ అందిస్తున్నారు. సేవాదళ్ కార్యకర్తలకు క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలు, ప్రజాసేవ భావన వంటి అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.
కాంగ్రెస్ సేవాదళ్ చరిత్రను ప్రస్తావిస్తూ నాయకులు మాట్లాడుతూ, 1923లో మహాత్మా గాంధీజీ ఆలోచనలతో డా. ఎన్.ఎస్. హార్డికర్ సారథ్యంలో ఈ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదటి అధ్యక్షుడిగా సేవాదళ్ను దేశవ్యాప్తంగా బలోపేతం చేసినట్లు గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ముందుండి పోరాడినట్లు పేర్కొన్నారు.
అలాగే, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి ప్రముఖ నాయకులు సేవాదళ్ శిక్షణ స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు వచ్చారని తెలిపారు. సేవాదళ్ కేవలం రాజకీయ సంస్థ మాత్రమే కాకుండా, దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావాన్ని పెంపొందించే వేదికగా నిలుస్తుందని వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, రాజ్యాంగ పరిరక్షణకు సేవాదళ్ పాత్ర మరింత కీలకమైందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. “సమర్థ్” శిబిరం ద్వారా తెలంగాణలో సేవాదళ్ను మరింత బలోపేతం చేసి, భవిష్యత్తులో శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం లక్ష్యమని చెప్పారు.
ఈ సందర్భంగా సేవాదళ్లో పనిచేస్తున్న వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, రాబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మల్రెడ్డి రామిరెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, పీసీసీ నాయకులు అప్సర్ యూసుఫ్, గోవిందరావు, ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ నేషనల్ కోఆర్డినేటర్లు, ఇన్చార్జీలు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మండల మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


శిబిరం సందర్భంగా దేశభక్తి గీతాలు, శారీరక వ్యాయామాలు, గ్రూప్ చర్చలు, నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సేవాదళ్ను గ్రామ స్థాయికి తీసుకెళ్లే దిశగా ఈ శిబిరం కీలకంగా మారనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.



