రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేస్తోంది – మే 6న వరంగల్లో బీఆర్ఎస్ భారీ రైతు సమావేశం: కేటీఆర్
Congress is deceiving the farming community – BRS to hold massive farmers’ meeting in Warangal on May 6: KTR
వరంగల్/హైదరాబాద్, ఏప్రిల్ 28 (వాయిస్ టుడే): రాష్ట్ర రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మే 6న వరంగల్లో భారీ రైతు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కేటీఆర్ను ఆహ్వానించగా, ఆయన హాజరవుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన హామీల మోసాన్ని రైతులకు గుర్తుచేసే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు తీవ్రంగా పెరిగాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తగ్గిన రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
రైతాంగానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే పోరాటాలకు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలు ఉన్నాయని స్థానిక నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై కేటీఆర్ కీలక సూచనలు చేశారు. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.
అలాగే ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని, ప్రతి బూత్లో దొంగ ఓట్లు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, బూత్ లెవెల్ సహాయకులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి,మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య,మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోతు కవిత తదితర ప్రముఖులు పాల్గొన్నారు.



