కౌన్సిలర్ నుంచి కేంద్ర మంత్రి వరకు బండి సంజయ్ ఎదుగుదలపై అసూయతో దుష్ప్రచారం: మున్నూరుకాపు నేతల ఆగ్రహం
Malicious Propaganda Driven by Envy Over Bandi Sanjay’s Rise—From Councilor to Union Minister: Munnuru Kapu Leaders Express Outrage

ఎర్రమంజిల్: వాయిస్ టుడే
కౌన్సిలర్ స్థాయి నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ కుమార్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారాలు జరుగుతున్నాయని తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం రావు పటేల్ విమర్శించారు.
ఆదివారం ఎర్రమంజిల్లోని హోటల్ మెర్క్యూర్లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలలో బలమైన సామాజికవర్గమైన మున్నూరుకాపులపై ఇటీవల అనేక కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరుకాపుల జనాభాను కేవలం 3.9 శాతంగా చూపించడం ద్వారా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
కౌన్సిలర్ స్థాయి నుంచి ఎదిగి నేడు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండి సంజయ్పై రాజకీయ కుతంత్రాలు జరుగుతున్నాయని, ఆయన కుమారుడిపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఎదిగితే వారిని అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
బండి సంజయ్ కుమారుడు ఎలాంటి తప్పు చేసినా చట్టం తన పని తాను చేస్తుందని, కానీ నిజాలు బయటకు రాకముందే అభాండాలు వేయడం సరికాదని చెప్పారు. బండి సంజయ్ వెనుక 40 లక్షల మంది మున్నూరుకాపులు అండగా ఉంటారని స్పష్టం చేశారు.
తెలంగాణ మున్నూరుకాపు పటేల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ, బండి సంజయ్ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు పన్నాగాలు జరుగుతున్నాయని అన్నారు. బడుగు వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా ఆయనకు రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉందని, కావాలనే అపవాదులు మోపుతున్నారని విమర్శించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, “బండి సంజయ్ కుమార్ ఎదుగుదల అనేది సాధారణ రాజకీయ ప్రయాణం కాదు, ఇది బడుగు బలహీన వర్గాల ఆశయాలకు ప్రతీక. అలాంటి నాయకుడిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారాలు చేయడం వెనుక పెద్ద రాజకీయ అజెండా ఉంది” అని ఆరోపించారు.
“సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మున్నూరుకాపు సమాజం అంత సులభంగా మోసపోదు. నిజం ఏదో ప్రజలు గుర్తిస్తారు” అని స్పష్టం చేశారు.
“ఒక నాయకుడు ప్రజల మద్దతుతో ఎదిగితే అతన్ని అణచివేయడానికి ఇలాంటి కుట్రలు జరుగుతుంటాయి. ఇది కేవలం బండి సంజయ్పై దాడి కాదు, మున్నూరుకాపు సమాజ గౌరవంపై దాడి” అని వ్యాఖ్యానించారు.
చివరగా, “మున్నూరుకాపుల ఐక్యతే మా బలం. ఎలాంటి కుట్రలైనా ఐక్యంగా ఎదుర్కొంటాం. బండి సంజయ్కు మా సంపూర్ణ మద్దతు కొనసాగుతుంది” అని తెలిపారు.
తెలంగాణ మున్నూరుకాపు మహాసభ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస రావు, వర్కింగ్ కమిటీ సభ్యుడు బుక్కా వేణుగోపాల్ కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ, బండి సంజయ్ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ సభ నేపథ్యంలో ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మున్నూరుకాపు నేతలు హెచ్చరించారు.
ఈ సమావేశంలో మున్నూరుకాపు సంఘం అపెక్స్ కన్వినర్ చంద్రయ్య, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సుంకరి బాలకృష్ణ, అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్, మున్నూరుకాపు సంఘం గ్రేటర్ అధ్యక్షులు ఆర్ వి మహేందర్ ,కాపు నాయకులు వట్టి సుబ్బారావు,అమర్ నాధ్ ,పద్మయ్య ,బాశెట్టి
తదితరులు పాల్గొన్నారు.



