‘సింగ్ గీతం’ మూవీ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఎస్.ఎస్. రాజమౌళి
S.S. Rajamouli purchased the first ticket for the movie ‘Singh Geetham’.
థియేటర్లలోకి రాకముందే ‘సింగ్ గీతం’ కథ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బలమైన ముద్ర వేసింది. నిర్మాత నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్తో జరిగిన ప్రత్యేక సంభాషణలో రాజమౌళి, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విజన్, అలాగే ఈ యూనిక్ మ్యూజికల్ ఫాంటసీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా ఐడియా తాను తొలిసారిగా 1995-96 ప్రాంతంలో తన సోదరుడు ఎం.ఎం. కీరవాణి ద్వారా విన్నాను. అప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ తన మదిలో నిలిచిపోయింది. “ఈ కథను మొదటిసారి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అది పూర్తిగా కొత్తగా, ఎవరికీ తట్టని ఆలోచనగా అనిపించింది. ఇంత వినూత్నమైన, సాహసోపేతమైన కథను తెరపైకి తీసుకురావడానికి కూడా అంతే వినూత్నంగా ఆలోచించే వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి నాగ్ అశ్విన్ సరైన వ్యక్తి” అన్నారు రాజమౌళి
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ మొదట భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సృజనాత్మక దర్శకుల్లో ఒకరైన సింగీతం శ్రీనివాసరావు గారికి ట్రిబ్యూట్ గా ప్రారంభమైందని చెప్పారు. అయితే, ఆ తర్వాత ఇది ప్రేక్షకులు తప్పకుండా ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన చిత్రంగా మారిందన్నారు.
“సింగ్ గీతం ప్రపంచంలోకి ప్రేక్షకులు లీనమైపోతారు. కథలో పూర్తిగా మమేకమైన తర్వాత ఇది మ్యూజికల్ ఫార్మాట్లో ఉందనే విషయం కూడా మరిచిపోతారు. పాత్రలు ఎందుకు పాడుతున్నారన్న దానికంటే, వారి భావోద్వేగ ప్రయాణాన్నే ఫాలో అవుతారు” అని నాగ్ అశ్విన్ తెలిపారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. తన కెరీర్లో అత్యంత విభిన్నమైన చిత్రాల్లో ‘సింగ్ గీతం’ ఒకటి. సాధారణ సినిమాల మాదిరిగా కాకుండా, ఈ చిత్రంలో షూటింగ్ ప్రారంభమయ్యే ముందే సంగీత ప్రపంచాన్ని సృష్టించాల్సి వచ్చిందన్నారు.
“ఈ సినిమా కోసం ముందుగానే ఒక పూర్తి సంగీత ప్రపంచాన్ని నిర్మించాం. ఈ ప్రక్రియలో వందలాది ట్యూన్లు కంపోజ్ చేశాను. ఇది ఎంతో సవాలుతో కూడుకున్నదైనా, అదే సమయంలో చాలా ఉత్సాహభరితంగా అనిపించింది. నేను ఇప్పటివరకు చేసిన వాటిలో ఇది పూర్తిగా భిన్నమైన అనుభవం” అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు.
ఈ సందర్భంగా రాజమౌళి ‘సింగ్ గీతం’ తొలి టికెట్ను కొనుగోలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది కేవలం సినిమాపై ఆయనకున్న నమ్మకానికే కాకుండా, తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు గారి పట్ల ఆయనకున్న అపార గౌరవానికి నిదర్శనంగా నిలిచింది.
భారతీయ సినీ ప్రేక్షకులు అరుదుగా చూసే ఓ ప్రత్యేక అనుభూతిని అందించాలనే లక్ష్యంతో రూపొందిన ‘సింగ్ గీతం’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



