ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాలకు ప్రత్యేక హెల్ప్‌లైన్

- Advertisement -

ఇందిరమ్మ టవర్స్‌పై సందేహాలకు ప్రత్యేక హెల్ప్‌లైన్

040-24603572ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దరఖాస్తుకు ఆధార్ ఒక్కటే చాలు – యూపీఐ ద్వారానే రూ.10 వేల ఈఎండీ చెల్లింపు – ఇల్లు రాకపోతే అదే ఖాతాకు రీఫండ్

Dedicated helpline for queries regarding Indiramma Towers

హైదరాబాద్, జూలై 25 (వాయిస్ టుడే): హైదరాబాద్ నగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ పథకంపై ప్రజల్లో ఎలాంటి సందేహాలు, అపోహలు లేకుండా పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్ హెల్ప్‌లైన్‌ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌లైన్ 040-24603572 నంబర్ ద్వారా ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి మధ్యవర్తులను నమ్మవద్దని, సందేహాలు ఉంటే నేరుగా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

హైదరాబాద్ క్యూర్ (Core Urban Region) పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు తాము నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాలు, అధికారిక ఆన్‌లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

ఈ పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తుదారు క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివాసం ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలలోపు ఉండాలి. దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యుల పేరిట క్యూర్ లేదా ఓఆర్‌ఆర్ పరిధిలో సొంత ఇల్లు, ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తామని, ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయిస్తామని తెలిపారు.

దరఖాస్తు సమయంలో ఆధార్ నంబర్ ఒక్కటే సరిపోతుందని, కులం, ఆదాయం తదితర ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని, లాటరీ సమయంలో సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

దరఖాస్తు సమయంలో రూ.10,000 ఈఎండీని యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే చెల్లించాలని, ఫ్లాట్ కేటాయించని పక్షంలో అదే ఖాతాకు పూర్తి మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని మంత్రి తెలిపారు. దరఖాస్తు సంఖ్య, చెల్లింపు రసీదు, మీ సేవ రసీదు, మొబైల్ నంబర్‌ను ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఈ పథకం కింద నిర్మించే ఫ్లాట్లు **1 బెడ్‌రూమ్, హాల్, కిచెన్ (1BHK)**తో సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడతాయని తెలిపారు. ఒక్కో ఫ్లాట్ మార్కెట్ విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండగా, ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీతో పాటు 20 నుంచి 25 గజాల అన్‌డివైడెడ్ షేర్ స్థలాన్ని లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుడు కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు.

దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించి, క్షేత్రస్థాయి ధ్రువీకరణ అనంతరం అర్హుల సంఖ్య ఫ్లాట్ల కంటే ఎక్కువగా ఉంటే పారదర్శక లాటరీ విధానంలో కేటాయింపులు చేపడతామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.పి. గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular