రైతులకు వెన్నుపోటు రాహుల్కు వెయ్యి కోట్లా…
అసెంబ్లీలో నిలదీస్తామన్న కేటీఆర్
A Betrayal of Farmers—Yet 1,000 Crores for Rahul?
KTR Vows to Confront the Issue in the Assembly
హైదరాబాద్
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచనుగా పడేదని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నా రైతుబంధు దిక్కులేదని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.శాసనసభ సమావేశాలకు ముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించామని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రెండున్నరేళ్లవుతున్నా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ఆనాడు గవర్నర్తో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పించారని తెలిపారు.
పంటల వేసే నాటికి కేసీఆర్ రైతుబంధు నిధులు వేసేవారని కేటీఆర్ గుర్తుచేశారు. రాహుల్ బంధు కాదు..రైతుబంధు వేయాలని కోరారు. రైతులకు వెన్నుపోటు,రాహుల్కు వెయ్యి కోట్లా అని నిలదీస్తామని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని, రైతుబంధుకు దిక్కే లేదని విమర్శించారు. వృద్ధులు పింఛన్లు, రైతులు, రైతు కూలీలు రైతు భరోసా కోసం ఎదరుచూస్తున్నారని తెలిపారు. జాబ్ క్యాలెండర్లో ఉత్త క్యాలెండర్ తప్ప జాబ్లు కనిపించడం లేదని అన్నారు.
ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని అన్నారు. ఆరు గ్యారంటీలకు రేవంత్ సర్కార్ మంగళం పడిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.



