నగరంలో కలకలం రేపిన స్థిరాస్తి వ్యాపారి

- Advertisement -

నగరంలో కలకలం రేపిన స్థిరాస్తి వ్యాపారి సింగోటం రాము అలియాస్‌ రమణ అలియాస్‌ రామన్న (36) హత్యకేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. పాతకక్షలు, అసూయ కారణంగానే తోటి స్నేహితుడు పథకం ప్రకారం దారుణంగా అంతమొందించినట్టు జూబ్లీహిల్స్‌ ఏసీపీ హరిప్రసాద్‌ తెలిపారు. జీడిమెట్లకు చెందిన మణికంఠ, రాము ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ మరికొంత మందితో కలిసి ‘జువా’ గేమ్‌ ఆడేవారని, దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని ఏసీపీ చెప్పారు. తరచూ గేమ్‌లో రాము డబ్బులు గెలవడంతో మణికంఠ కక్ష పెంచుకున్నాడు.
గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా, రాము.. మణికంఠపై దాడి చేశాడు. అప్పటి నుంచి మరింత కక్ష పెంచుకున్నాడు. రామును హత్య చేయాలని పథకం ప్రకారం హిమాంబి, నజీమా అనే మహిళలతో హనీట్రాప్‌ చేయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళలు రాముకు ఫోన్‌ చేసి రమ్మనడంతో అతను యూసఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌ నగర్‌కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన మణికంఠ, వినోద్‌, మహమ్మద్‌ ఖైసర్‌, శివకుమార్‌, నిఖిల్‌, తున్నా కుమార్‌, మరో ఐదుగురు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఇందుకు ఇద్దరు మహిళలు సహకరించారని ఏసీపీ తెలిపారు. నిందితులు జీడిమెట్లలోని రామ్‌రెడ్డి నగర్‌లో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో అయిదుగురి కోసం గాలిస్తున్నారు.
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంకు చెందిన పుట్టా రాము అలియాస్‌ సింగోటం రాము అలియాస్‌ రమణ అలియాస్‌ రామన్న(36) హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌ ప్రాంతంలో నివసించేవాడు. డ్రైవర్‌గా పని చేస్తూ స్థిరాస్తి రంగంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో బాగా సంపాదించాడు. అబ్దుల్‌కలాం సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి కొల్లాపూర్‌ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఒంటి మీద అర కిలో బంగారు ఆభరణాలు ధరించి ‘గోల్డ్‌మ్యాన్‌’గానూ ప్రసిద్ధి చెందాడు. రాజకీయంగా ఎదగడానికి కొల్లాపూర్‌లోనే ఉంటూ భాజపాలో చేరాడు. ఈ క్రమంలో దారుణహత్యకు గురయ్యాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular