Sunday, September 8, 2024

నీళ్ల ఉద్యమానికి తెర తీస్తున్న గులాబీ

- Advertisement -

నీళ్ల ఉద్యమానికి తెర తీస్తున్న గులాబీ
నల్గోండ, ఫిబ్రవరి 5
కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ బీఆర్ఎస్ యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రధానంగా కృష్ణా జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చలో నల్లగొండకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.కృష్ణా జలాలతో అత్యధిక లబ్ధి పొందుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్.. రేవంత్ సర్కార్ పై పోరాటానికి సిద్ధమవుతోంది. ఛలో నల్లగొండ పేరుతో ఈనెలలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. లక్ష మందితో నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. నల్లగొండ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ నేతలు నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు అధిష్టానం సమాచారం అందించింది.కృష్ణా జలాలకు సంబంధించి సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకోవడం, అంతకుముందు ఆంధ్రా అధికారులు అనుమతి లేకుండా నీటిని విడుదల చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణా జలాల విషయంలో రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీనేలా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేఆర్‌ఎంబీకి కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించడాన్ని బీఆర్‌ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. కృష్ణా జలాల అంశాన్ని బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకోనుంది. తెలంగాణ వాటా తేల్చకుండానే ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడం ఏంటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదనడానికి ఇదే ఉదాహరణ అని విమర్శించింది. రేవంత్ సర్కార్ ప్రాజెక్టులను ఢిల్లీ ప్రభుత్వ చేతుల్లో పెట్టిందని బీఆర్ఎస్ విరుచుకు పడుతోంది.ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆరోపించింది. భవిష్యత్తులో ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా.. ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు తీసుకోవాలన్న వారి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించింది. గతంలోనే దీనిపై తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా చేసిందని 2021లో నిర్ణయం తీసుకున్నా.. అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించలేదని బీఆర్‌ఎస్‌ చెబుతోంది.ఇప్పటికే నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసిన ఎంపీలు, కేఆర్‌ఎంబీ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి వివరించారు. ప్రాజెక్టుల అప్పగింతపై తమకున్న అభ్యంతరాలను తెలుపుతూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై 2003 ఆగస్టు 26న కోదాడ నుండి కేసీఆర్‌ పాదయాత్ర చేపట్టారు. నాలుగు రోజలపాటు సాగిన పాదయాత్ర హాలియాలో బహిరంగ సభతో ముగిసింది. 2004లో ఫ్లోరైడ్‌పై అధ్యయన కోసం కేసీఆర్‌ రెండ్రోజుల బస్సు యాత్ర చేపట్టారు. మర్రిగూడ, నాంపల్లి, చండూర్‌, నార్కట్‌పల్లి మండలాల్లో పర్యటించి ఫ్లోరైడ్‌ బాధితులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సమయంలోనే గుండె నిండా ఫ్లోరైడ్‌ బండా… తల్లడిల్లే నల్లగొండ అంటూ స్వయంగా కేసీఆర్‌ పాట రచన చేశారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కృష్ణా జలాల్లో వాటా కోసం మరోసారి పోరాటానికి సన్నద్ధమవుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్