- Advertisement -
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు
Abolition of MLC by-election of local bodiesవిజయనగరం, నవంబర్ 15, (వాయిస్ టుడే)
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇప్పటికే నామినేషన్ల గడువు ముగిసింది. అయితే హైకోర్టు తీర్పును అనుసరించి ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లుగా ఈసీ ప్రకటించింది. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజుపై ఎన్నికలకు ముందు చైర్మన్ మోషేన్ రాజు అనర్హతా వేటు వేశారు. అయితే తాను ఎక్కడా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అధిగమించలేదని తనపై అన్యాయంగా అనర్హతా వేటు వేశారని ఎమ్మెల్సీ రఘురాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇటీవల హైకోర్టు రఘురాజుజపై అనర్హతా వేటు చెల్లదని స్పష్టం చేసింది. దీంతో రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగడం ఖాయమయింది. కానీ హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో ఏమీ చెప్పలేదు. ఇందుకూరి రఘురాజు తనపై అనర్హతా వేటు విషయంలో మాత్రమే కోర్టును ఆశ్రయించారు. ఆ తీర్పు రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం పడింది. అయితే అధికారిక ప్రకటన చేయాల్సింది ఎన్నికల సంఘం కాబట్టి ఉత్కంఠత ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఇందుకూరి రఘురాజు సతీమణి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకైనా మంచిదని వారు నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హైకోర్టు తీర్పు కాపీలు అందడంతో.. రఘురాజు స్థానం ఖాళీ కానట్లే అక్కడ ఉపఎన్నిక నిర్వహించినా చెల్లదన్న అంచనాకు వచ్చిన ఎన్నికల సంఘం తాజాగా ఆ ఎన్నికను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజు వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే ఆయనకు బొత్స సత్యనారాయణతో సరిపడకపోవడంతో ఆయన పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. తన ప్రత్యర్థుల్ని ప్రోత్సహిస్తూ తనను బొత్స పక్కన పెట్టేస్తున్నారని ఇందుకూరి రఘురాజు అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన వర్గం అంతా టీడీపీలో చేరిపోయారు. అనర్హతా వేటు పడుతుందన్న కారణంగా ఆయన మాత్రం పార్టీ మారలేదు. అయితే పార్టీ మారిపోయారని వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. విచారణకు నోటీసులు ఇచ్చినా రఘురాజు హాజరు కాలేదు. అయినప్పటికీ అనర్హతా వేటు వేశారు. చివరికి న్యాయపోరాటం చేసి తన పదవిని తాను కాపాడుకున్నారు.
- Advertisement -




