రాష్ట్రంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Accreditation card for every eligible journalist in the state – Minister Ponguleti Srinivasa Reddy
హైదరాబాద్, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు.
ఈరోజు సచివాలయంలోని తన కార్యాలయంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ సి.హెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి సిపిఆర్వో జి. మల్సూర్లతో కలిసి మంత్రి అక్రిడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా మరియు సాంకేతిక ఆధారితంగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జి.ఓ. 252ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్టు సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన సవరణలతో జి.ఓ. 103ను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 44,706 మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని వివరించారు.
అక్రిడిటేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు మాత్రమే కాకుండా పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు, అధికారిక కార్యక్రమాలకు ప్రవేశం, భద్రతా సౌకర్యాలు, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసి అర్హతల పరిశీలన వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అక్రిడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అవసరాన్ని బట్టి మరోసారి సమీక్షా సమావేశాలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.


