మొదలైన మేడారం మహాజాతర
వనదేవతల కొలువుకు వేళాయె
వరంగల్, జనవరి 28, (వాయిస్ టుడే )
All paths lead to the nymphs’ palaces – Medaram turned into a riot
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సాంకేతికతను ఉపయోగించి భద్రతను పటిష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం అనేక వసతులు కల్పించారుఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో కోలాహలంగా ప్రారంభమైంది. కోట్ల మంది భక్తుల కొంగుబంగారమైన వనదేవతలు గద్దెలపై కొలువుదీరే శుభఘడియలు ఆసన్నమవడంతో.. అటవీ ప్రాంతమంతా భక్తజన సంద్రమైంది. నేటి నుంచి ఈ నెల 31 వరకు నాలుగు రోజుల పాటు వైభవంగా సాగే ఈ జాతరకు ప్రభుత్వం సుమారు రూ.251 కోట్ల నిధులతో భారీ ఏర్పాట్లు చేసింది.మేడారం జాతరలో మొదటి ఘట్టం సారలమ్మ రాకతో మొదలవుతుంది. ఇవాళ సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు పెళ్లికొడుకుల రూపంలో కాలినడకన మేడారానికి చేరుకుంటారు. జాతరలో అత్యంత కీలక ఘట్టం గురువారం నాడు జరిగే సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్టపై నుంచి కుంకుమభరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెపైకి తెచ్చే సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. శుక్రవారం నాడు భక్తులు దేవతలకు నిలువెత్తు ‘బంగారం’ (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతల ‘వన ప్రవేశం’తో ఈ మహాక్రతువు ముగుస్తుంది.ఈ ఏడాది సుమారు కోటిన్నర మంది భక్తులు మేడారానికి వస్తారని అంచనా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు, జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించింది. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయగా.. విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం 21 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూనే.. ఆధునిక వసతులతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.
ఈసారి మేడారం జాతరలో సాంకేతికత ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తొలిసారిగా కృత్రిమ మేధ (AI) పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. జనసమూహాన్ని పర్యవేక్షించడంతో పాటు, జాతరలో తప్పిపోయిన చిన్న పిల్లలను, వృద్ధులను ముఖ గుర్తింపు ద్వారా త్వరగా గుర్తించేందుకు ఈ టెక్నాలజీ తోడ్పడుతోంది. వేల సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో జాతరను హైటెక్ హంగులతో నిర్వహిస్తున్నారు.
పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పయనం
జాతరలో భాగంగా మంగళవారమే పగిడిద్దరాజు పయనం మొదలైంది. పూనుగొండ్ల గ్రామంలోని పెనుక వంశీయుల ఆధ్వర్యంలో పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి, సుమారు 62 కిలోమీటర్ల మేర అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి తీసుకువస్తున్నారు. ఆదివాసీల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య సాగే ఈ ఊరేగింపు భక్తిభావంతో సాగుతోంది. ఇవాళ సాయంత్రానికి పగిడిద్దరాజు మేడారం చేరుకోవడంతో జాతరలో తొలి ప్రధాన ఘట్టం పూర్తవుతుంది.



