ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలా సన్నద్ధం కావాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
హైదరాబాద్ మార్చ్ 13
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ద్వారా ఏ క్షణంలోనైనా షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణ కోసం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని, ఎన్నికల ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎన్నికల నిర్వహణ అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఓటరు నమోదు, మార్పులు-చేర్పులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, వాటి సత్వర పరిష్కారం, 18 – 19 వయస్సు కలిగిన యువతచే ఓటరు జాబితాలో పేర్లు నమోదు కోసం దరఖాస్తులు చేయించడం, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, మోడల్ పీ.ఎస్ ల ఏర్పాటు, మృతి చెందిన, వలస వెళ్లిన ఓటర్ల విషయంలో చేపట్టాల్సిన చర్యలు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, వారికి శిక్షణ తరగతులు నిర్వహించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రాండమైజేషన్, భద్రతాపరమైన ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షిస్తూ, జిల్లా ఎన్నికల అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గత ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరిగిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సెక్టోరల్ అధికారులచే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను సేకరించాలని, వాటి వివరాలను సకాలంలో పంపించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే నియమించినట్లైతే శనివారం మొదటి ర్యాండమైజేషన్ జరపాలని, ఈ.వీ.ఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను కూడా ఒకే రోజున, ఒకే సమయంలో అన్ని జిల్లాలలో చేపట్టాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలని, తమకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పించలేదని ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం కల్పించవద్దని హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని, ఎన్నికల షెడ్యుల్ కు పెండింగ్లో ఉన్న ఫామ్స్ అన్నియు పూర్తి చేయాలనీ అన్నారు. పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని నోడల్ అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్ , ఆర్ డి ఓ విజయకుమారి, శ్రీనివాసులు ,ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రినివాస్ , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలా సన్నద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -



