పాతబస్తీలో అసద్ బైక్ పై టూర్

హైదరాబాద్, ఆగస్టు 16: ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. బైక్ హ్యాండిల్స్కు రెండు జాతీయ జెండాలను కట్టుకుని పాత బస్తీలో హల్చల్ చేశారు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ బైక్పై రైడ్ చేశారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పైనే పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన జెండా వందనంలో ఎంపీ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో గతేడాది మాదిరిగానే చార్మినార్ సమీపంలోని మదీనా సర్కిల్లో ఒవైసీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఏడాది ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. శాస్త్రిపురంలోని తన నివాసం నుంచి బైక్పై బయలుదేరారు. ఆయనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరు అనుచరులు బైక్లపై వచ్చారు. రోడ్లపై బైక్లు నడపడం అంటే తనకు ఎంతో ఇష్టమని అసదుద్దీన్ ఒవైసీ గతంలో పలుమార్లు చెప్పారు.కాగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తండ్రి దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 1970, 1980లలో మోటార్సైకిల్పైనే తరచూ తన నియోజకవర్గాన్ని సందర్శించేవారు. అప్పట్లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ మోటార్సైకిల్పై పలుమార్లు పర్యటించి ప్రసిద్ధిగాంచారు. ఇక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం తరచూ కారులో ప్రయాణించేవారు. ఐతే అప్పుడప్పుడూ అసదుద్దీన్ మోటర్బైక్పై రోడ్లపైకి వస్తుంటారు. డిసెంబర్ 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన బైక్పై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.



