మహబూబ్ నగర్, నవంబర్ 27, (వాయిస్ టుడే): ల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క శిరీషకు అనూహ్యంగా మద్దతు పెరుగుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఇప్పటికే బర్రెలక్క చాలా ఫేమస్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఒంటరి పోరు చేస్తున్న బర్రెలక్కకు స్థానికంగా మద్దతు లభించడంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. బర్రెలక్కకు రోజు రోజుకు ఆదరణ పెరగుతుండటంతో ప్రత్యర్థి వర్గాల తట్టుకోలేక దాడి కూడా జరిగింది. దీంతో బర్రెలక్క తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు శిరీషకు 2+2 సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చింది. దీంతో నిర్విరామంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ.. తన మాటలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.అయితే తనపై దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బర్రెలక్క కన్నీటి పర్యంతమయ్యారు. దాడి తర్వాత బర్రెలక్కకు నియోజకవర్గం దాటి రాష్ట్రం, దేశం నలుమూల నుంచి మద్దతు పెరుగుతూ వచ్చింది. ఇందులో సామాన్య ప్రజలతో పాటు మేధావులు, సెలబ్రిటీ, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు.సెన్సేషన్గా మారిన బర్రెలక్కకు తాజాగా వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ సైతం అండగా నిలిచారు. సోషల్ మీడియా వేదికగా బర్రెలక్కను నేటి తరం మహాత్మా గాంధీతో పోల్చారు రాంగోపాల్ వర్మ. అన్యాయానికి వ్యతిరేకంగా గాంధీజీ మొదలుపెట్టిన సత్యాగ్రహ ఉద్యమాన్ని, బర్రెలక్క ఉద్యమం రెండు ఒకేలా ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేశారు. RGV నే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇతరులు కూడా మద్దతు తెలుపుతున్నారు.తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్కను గెలిపించి భారత రాజ్యాంగానికి వన్నె తేవాలని సీబీఐ మాజీ డైరక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను పక్కకు తప్పించి, బర్రెలక్కకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన, వ్యక్తి పూజలు రాచరికానికి దారితీస్తాయని తెలిపారు. మనకోసం మనం రాసుకున్న రాజ్యాన్ని పరిరక్షించాలంటే, ఎన్నికల్లో డబ్బున్న వారికి కాదు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అందుకే తాను కొల్లాపూర్ బర్రెలక్క కోసం ప్రచారం చేశానని తెలిపారు. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా ఇప్పటికైనా ప్రధాన పార్టీలు తమ కార్యకర్తలతో బర్రెలక్క విజయానికి కృషి చేయాలని జేడీ పిలుపునిచ్చారు.
ఎవరీ బర్రెలక్క
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన కర్నె శిరీష తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ కాకపోవడంపై ప్రశ్నిస్తూ అప్పట్లో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నోటిఫికేషన్లు రాక తాను బర్రెలు కాసుకుంటున్నట్లు అందులో చెప్పారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె పాపులర్ అయి ఫాలోయర్లు పెరిగారు. అప్పటి నుంచి బర్రెలక్కగా పేరొందారు. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి బరిలో నిలిచారు. తాను గెలిస్తే నిరుద్యోగులు, ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తానని హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి కూడా మద్దతు లభించింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఓటేసి గెలిపించాలని కొందరు నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. అయితే, ఇటీవల పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై కూడా దాడి చేశారు. దీంతో తనకు 2+2 భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు మద్దతుగా అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్, ఆదిత్య సైతం అండగా నిలిచారు. ఆమె పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆమెకు భద్రత కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఆమె ఓ గన్ మెన్ ఉండాలని స్పష్టం చేసింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే భద్రత కల్పించడం సరికాదని, ముప్పు ఉన్న ప్రతి అభ్యర్థికి సెక్యురిటీ ఇవ్వాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ క్రమంలో ఆమెకు భద్రత కల్పించారు.
అన్ని వర్గాలు బర్రెలక్క శిరీష వెన్నంటి నిలుస్తున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆమె కోసం మద్దతు ప్రకటిస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతినిధిగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిల్చున్న ఆమెకు తాజాగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. ‘మా రక్ష’ బర్రెలక్కకు బేషరతుగా మద్దతు ప్రకటిస్తోందని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు. సెలబ్రిటీలతో పాటు ఎన్నారైల నుంచి కూడా బర్రెలక్కకు మద్దతు లభిస్తుంది.



