కొల్లాపూర్ నవంబర్ 30: కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మర్రికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఆమె ఓటు వేశారు. కాగా, ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో బర్రెలక్కకు ఈసీ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. ఆ సెక్యూరిటీతోనే ఆమె పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బర్రెలక్క.. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు అందరూ పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరారు.ఇక ఈ ఎన్నికల్లో ఆమె నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు వీలుగా కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో ఆమెకు తీవ్ర బెదిరింపులు వచ్చాయి. శిరీష తమ్ముడిపై దాడి కూడా జరిగింది. బర్రెలక్కకు వచ్చిన ఆదరణ చూసి, ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ ఇతర పార్టీల అభ్యర్థులు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో గన్మెన్లతో సెక్యూరిటీని కల్పించారు ఎన్నికల అధికారులు.



