అధికారులు అప్రమత్తంగా ఉండండి
Be Alert Officers...
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి
భారీ వర్షాలపై కలెక్టర్లకు లేఖ రాసిన ఎంపీ అర్వింద్
జగిత్యాల,
జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి లేఖ రాసారు. లేఖలో జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందని, మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ ఆర్ అండ్ బి, పోలీస్, విద్యుత్ మరియు ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని
ఎంపీ అర్వింద్ కోరారు.అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 26 గేట్లు తెరిచినందున మత్సకారులు, జాలర్లను అప్రమత్తం చేయాలని, నిరాశ్రయులైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి కనీస సౌకర్యాలు అందజేయాలని ఎంపీ కోరారు.
మరోవైపు ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని ఆయన కోరారు. వ్యవసాయ మోటర్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, గోదావరి పరివాహక గ్రామాల మత్సకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని
అర్వింద్ ధర్మపురి కోరారు.