రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
Better medical services should be provided to the patients
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 100 మందికి డయాలసిస్
వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం
ఆసుపత్రిలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
*రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
బద్వేలు
వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి గ్రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం రాయచోటి ఏరియా ఆసుపత్రి నందు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ…. అన్నమయ్య జిల్లాలో డయాలసిస్ బాధితుల సమస్యను దృష్టిలో ఉంచుకొని రాయచోటి ఏరియా ఆసుపత్రి నందు ప్రతిరోజు 100 మందికి డయాలసిస్ చేయడానికి నూతన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో డయాలసిస్ చేయించుకోవాలంటే తిరుపతి, చెన్నై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేవారని నేడు మన ఏరియా ఆసుపత్రిలోనే డయాలసిస్ రోగులకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందన్నారు.
రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో 60 మందికి మాత్రమే డయాలసిస్ చేసే సామర్థ్యం ఉండేదని డయాలసిస్ బాధితుల సౌకర్యార్థం 60 నుంచి 100 మందికి డయాలసిస్ చేసే అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
ప్రభుత్వం వైద్యాభివృద్ధికి అధిక నిధులు ఖర్చు చేస్తూ పేదల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. మనం తినే కల్తీ ఆహారం వల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు జనరల్ చెకప్ చేయించుకుని వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి 14 మండలాలకు మధ్యలో ఉందని దీంతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి చాలావరకు పేదవాళ్లు వస్తుంటారని వారిని ఆప్యాయతతో స్నేహపూర్వకంగా పలకరించి వైద్య సేవలందించాలన్నారు.
మందుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆసుపత్రి అభివృద్ధికి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి రాబోయే ఆరు మాసాలలో ఆసుపత్రి లోని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రతిరోజు ఆసుపత్రికి ఎంత మంది రోగులు వస్తున్నారు, హాస్పిటల్ లో రోజుకు ఎన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, అత్యవసర సమయాలలో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏ సమయం నుండి వైద్య సర్వీసులు అందిస్తున్నారు,
వైద్య పరికరాల కొరత ఏమైనా ఉందా తదితర అంశాలపై మంత్రి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో రోగులకు త్రాగునీరు అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు టాయిలెట్లు శుభ్రపరుస్తూ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, డాక్టర్లు నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



