- Advertisement -
ఈఎంఐ కట్టాలని బైక్ కు నిప్పు
Bike is on fire to pay EMI
మెదక్, నవంబర్ 25, (వాయిస్ టుడే)
ఈఎంఐ.. మధ్య తరగతి, సామాన్య ప్రజలు చాలామంది సులభ వాయిదా పద్ధతుల్లో వస్తువులు కొనుక్కునేందుకు ఎక్కువగా మొగ్గు చూపే విధానం. నెలవారీ వాయిదా పద్ధతుల్లో డబ్బులు చెల్లించి తమకు ఇష్టమైన వస్తువులను సొంతం చేసుకుంటారు. అయితే, గడువు లోపు చెల్లిస్తే ఈ విధానంలో ఎలాంటి అదనపు భారమూ ఉండదు. అదే ఈఎంఐ చెల్లించడం లేట్ అయితే అనుకున్న దాని కన్నా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల విషయానికొస్తే సమయానికి డబ్బులు చెల్లించకుంటే వారు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. ఇంటికి వచ్చి మరీ డబ్బులు చెల్లించాలంటూ నిలదీస్తారు. అలా వేధింపులకు విసిగిపోయిన ఓ యువకుడు బైక్కు నిప్పు పెట్టిన ఘటన మెదక్ జిల్లాలో తాజాగా జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన యువకుడు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో డబ్బులు తీసుకుని ఈఎంఐ పద్ధతిలో బైక్ కొనుగోలు చేశాడు. ఈఎంఐలు మొత్తం చెల్లించినా.. ఇంకా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ బకాయి ఉందంటూ ఫైనాన్స్ సిబ్బంది వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తరచూ ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం కూడా సదరు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు డబ్బుల కోసం ఇంటికి రాగా యువకుడు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఆ ఏజెంట్ ముందే బైక్కు నిప్పంటించగా అది పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
- Advertisement -