మంచిర్యాల జిల్లా:నవంబర్ 24: రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతు బంధు ఉండాలా వద్దా ? అనేది ప్రజలే చెప్పాలని సిఎం కెసిఆర్ అడిగారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్ చాలు అంటున్నాడని, సాగుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా? ప్రజలే చెపాలన్నారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. బిఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావుకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నాడని,మళ్లీ విఆర్ఒ, పటేల్, పట్వారీ వ్యవస్థలు రావాలా? అని నిలదీశారు.
ఎన్నికలు వస్తే ఆగమాగంగా ఓటేయొద్దని సూచించారు. నాలుగు చందమామలు, ఆరు సూర్యుళ్లు తెస్తామంటే నమ్మొద్దని హితువు పలికారు.
ఓట్లను సద్వినియోగం చేస్తే వచ్చే ఐదేళ్లు మంచిర్యాల భవిష్యత్ బాగుంటుందని అన్నారు.మంచి ఎంఎల్ఎలు గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుందని, అభ్యర్థితో పాటు ఆ పార్టీ చరిత్ర కూడా పరిశీలించాలని కెసిఆర్ సూచించారు.
ప్రజలపై పార్టీల దృక్పథాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, మడమ తిప్పకుండా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని కెసిఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ చేసిన తప్పుకు 50 ఏండ్లు గోసపడ్డామని, తలాపునే గోదారి ఉన్న మన చేను మన చెలక ఎడారి అని పాటలు రాశారని, ఆనాడు రైతుల ఆత్మహత్యల భయంకరమైన వలసలు ఉండేవని అని మండిపడ్డారు. మళ్లీ మనకు మంచి రోజులు రావాలంటే బిఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు…



