హైదరాబాద్: రెజిమెంటల్బజార్, అమెరికాలో వైద్యుడినంటూ భారతీయ యువతులను పెళ్లి పేరుతో మోసగించి పెద్దఎత్తున సొమ్ము కొట్టేస్తున్న నైజీరియన్ను అరెస్టు చేశారు. శనివారం సికింద్రాబాద్ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో సైబర్క్రైమ్ డీసీపీ కవిత, మహంకాళి ఏసీపీ బి.రవీందర్, ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.సైదులు, మార్కెట్ ఇన్స్పెక్టర్ ఎం.రామకృష్ణతో కలసి డీసీపీ చందనదీప్తి వివరాలు వెల్లడించారు. నైజీరియా లాగోస్కు చెందిన అలెక్స్ మార్క్(44) కుటుంబం 20 ఏళ్ల క్రితం వస్త్రవ్యాపారంతో ముంబయి చేరింది.

అక్కడ నైజీరియన్ మిత్రులతో కలసి సైబర్ మోసాలకు తెరలేపాడు. గతేడాది ఆయుర్వేద నూనె పేరుతో మోసానికి పాల్పడిన ఇతడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 7 నెలలకు జైలు నుంచి బయటకు వచ్చాక కొత్తదారి వెతికాడు. భారత్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో అదిజవేష్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. అమెరికాలోని హూస్టన్లో ఉంటున్నానని, బ్రూక్ ఆర్మీ మెడికల్ సెంటర్(బీఏఎంసీ)లో సర్జన్గా పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాక ఒకరోజు తాను సంస్థ పనిమీద సిరియా వెళ్తున్నట్టు ఫోన్ ద్వారా చెప్పాడు. సిరియాలో బేస్క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారని, బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేసినట్టు నమ్మించి.. యువతి నుంచి కొంతమేర నగదు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. అనంతరం తాను భారతదేశం వస్తున్నానని విలువైన బహుమతులు తీసుకొచ్చానని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారంటూ డబ్బు కావాలని కోరటంతో బాధితురాలు రూ.27.43లక్షల నగదు అతడి బ్యాంకు ఖాతాలో జమచేసింది. కొద్దిరోజుల తరువాత మాయగాడు యువతికి బ్లాక్ ఎండ్ కరెన్సీ బాక్స్ను పంపాడు. అతడి నుంచి మరింత డబ్బు పంపాలంటూ ఒత్తిడి పెరగడంతో యువతి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు సారథ్యంలో ఏసీపీ రవీందర్, ఇన్స్పెక్టర్లు దర్యాప్తు చేపట్టి.. అలెక్స్మార్క్ను అరెస్టు చేశారు. ఇదే ఘటనలో యువతిని మోసగించిన మరో నైజీరియన్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితుడిపై హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, సంగారెడ్డి గుజరాత్ పరిధిలో 12 కేసులు నమోదయ్యాయి. ఏడాది వ్యవధిలో 63 సిమ్కార్డులు వాడినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 1,025 మోసాల్లో భాగమైనట్టు నిర్ధారించారు.



