ఏఐ వినియోగంపై కేంద్రం ఆంక్షలు
బెంగళూరు, ఫిబ్రవరి 12, (వాయిస్ టుడే )
Center imposes restrictions on the use of AI
కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన కంటెంట్కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్ను ప్రచురించేటప్పుడు సోషల్ మీడియా వేదికలు తప్పనిసరిగా లేబుల్ (వాటర్ మార్క్) వేయాలని ఆదేశించింది. ఏఐ కంటెంట్ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని స్పష్టం చేసింది. ఒకసారి మార్క్ చేసి కంటెంట్, మెటా డేటాను తొలగించడం లేదా దానిని కనిపించకుండా చేయడానికి అవకాశం ఉండరాదదని తెలిపింది. చట్టవిరుద్ధమైన, అభ్యంతకరమైన, మోసపూరిత కంటెంట్ను నిరోధించేందుకు ఆటోమేటెడ్ టూల్స్ను అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియా వేదికలకు సూచించింది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేస్తే జరిమానాలు, శిక్షల గురించి యూజర్లకు అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం ప్రతి 3 నెలలకు ఒకసారి హెచ్చరికల సందేశాలు పంపించాలని తేల్చిచెప్పింది.తమ వేదికల్లో ఏఐ క్రియేషన్ లేదా డీప్ఫేక్ కంటెంట్ను తొలగించేందుకు కూడా సోషల్ మీడియ ప్లాట్మ్లకు గడువు విధించింది. ప్రభుత్వం లేదా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసినప్పుడు వాటిని మూడు గంటల్లోపే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఏఐ క్రియేటెడ్ కంటెంట్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఏది అసలు? ఏది ఏఐ? అనేది గుర్తుపట్టలేనంతంగా ఉంటోంది. అందుకే ఏఐ కంటెంట్ను గుర్తించేలా వాటర్ మార్క్ పెట్టాలని సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశించింది.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత నెలలో ఐటీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు,డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) చట్టం నియమాలు 2021 కు ప్రతిపాదించిన ముసాయిదా సవరణలు, ఆన్లైన్లో AI ఆధారిత డీప్ఫేక్లు వ్యాప్తిపై పెరుగుతున్న ఆందోళనల మధ్య తాజా ఆదేశాలు వెలువడ్డాయి. క్రియేషన్ లేదా సవరించిన కంటెంట్ను పోస్ట్ చేసేటప్పుడు యూజర్లు దానిని వెల్లడించడం తప్పనిసరని ముసాయిదా నియమాలు చెబుతున్నాయి. అటువంటి ప్రకటనలను ధ్రువీకరించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సాంకేతికతను వినియోగించాలని సూచిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఇప్పటికే వినియోగదారులకు నిర్దిష్ట కంటెంట్ను ఏఐను ఉపయోగించి రూపొందించిన లేదా సవరించిన దానిని లేబుల్ చేయడానికి అనుమతించే మార్గదర్శకాలను విడుదల చేసింది.



