నల్గోండ, అక్టోబరు 11, (వాయిస్ టుడే): ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో టికెట్ పోరు మొదలైంది. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్ షేర్ ఉన్న మాదిగలు ఈసారి తమ వర్గానికే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తుంగతుర్తిలో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ రెండు సార్లు విజయం సాధించగా, ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ రెండు సార్లు ఓటమి పాలయ్యారు. పలువురు నాయకుల ప్రధాన అడ్డాగా ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్ లో ఇప్పుడు ఎస్సీ ఉపకులాల మధ్య టికెట్ పోరు జరుగుతోంది.తుంగతుర్తి నియోజకవర్గం 2004 అసెంబ్లీ ఎన్నికల దాకా జనరల్ స్థానం 2009 ఎన్నికల సమయంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఈ సీటు ఎస్సీలకు రిజర్వు అయ్యింది. పునర్విభజన తర్వాత జరిగిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ టికెట్ పై మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. కాగా, ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు టికెట్ కేటాయించింది. ఆయన హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలైన అద్దంకి దయాకర్ మూడోసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు.

కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గానికి వస్తారని ఆయనపై ఓ అభిప్రాయం బలపడింది. ఆయనతో పాటు మరికొందరు నాయకులు ఈ సారి టికెట్ ఆశిస్తున్నారు అనధికారిక సమాచారం మేరకు ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎస్సీల ఓట్లు 72 వేల పైచిలుకు ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ ఎస్సీ మాదిగ ఉపకులం ఓట్లు కనీసం 60 వేల దాకా ఉంటాయని సమాచారం. మరో ఉపకులం ఎస్సీ మాలల ఓట్లు 12 వేల వరకు ఉంటాయని తెలుస్తోంది. అత్యధికంగా ఓట్లున్న తమకే టికెట్ కేటాయించాలన్న డిమాండ్ ఎస్సీ మాదిగల నుంచి వస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి అద్దంకి దయార్ తో పాటు పిడమర్తి రవి, డాక్టర్ రవి, వంటి నాయకులు టికెట్ కోసం సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పిడమర్తి రవి సైతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు సైతం టికెట్ హామీ దొరికితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గాదరి కిషోర్ కుమార్ స్థానికేతరుడు కావడంతో పాటు ఎస్సీ మాల ఉపకులానికి చెందిన వారు. అద్దంకి దయాకర్ సైతం ఎస్సీ మాల ఉపకులానికి చెందిన వారే. ఎస్సీ మాదిగల ఓట్లు ఎక్కువగా ఉన్నందున తమ వర్గానికే టికెట్ కేటాయించాలని పలువురు కాంగ్రెస్ రాష్ట్ర , జాతీయ నాయకత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు.భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నకిరేకల్. ఈ స్థానాన్ని ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి కేటాయించే అవకాశం ఉంది. టికెట్ హామీపైనే ఆయన ఏఐసీసీ నాయకత్వం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వేముల వీరేశం ఎస్సీ మాదిగ ఉపకులానికి చెందిన వారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఉన్న రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో ఎలాగూ నకిరేకల్ మాదిగలకు ఇచ్చే అవకాశం ఉన్నందున తుంగతుర్తిలో ఎస్సీ మాల అభ్యర్థికి ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన పలువురు నాయకులు, ఆశావహులు మూడు రోజుల కిందట సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను కలిసి డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక్కడి స్థానిక నాయకులు తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని, బయటి వారికి, ఇతర ఉపకులం వారికి టికెట్ కేటాయిస్తే తాము పార్టీ కోసం పనిచేయలేమని తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.



