సి ఎం ఆర్ లక్ష్యలను నూరు శాతం సాధించాలి
CMR targets should be achieved 100%
భూపాలపల్లి,
సి.ఎం.ఆర్ లక్ష్యాలను నూరు శాతం సాధించాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మిల్లర్లను ఆదేశించారు
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో సి ఎం ఆర్, ఖరీఫ్ దాన్యం కేటాయింపు, మిల్లులు ట్యాగింగ్, మార్కెట్ కమిటీ లైసెన్సులు తదితర అంశాలపై పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార శాఖ, రైస్ మిల్లర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు సి ఎం ఆర్ లక్ష్యం 77.46 శాతం పూర్తి చేశామని, మిగిలిన లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సి ఎం ఆర్ ప్రక్రియపై కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు మిల్లర్లు మార్కెట్ కమిటి లైసెన్స్ పొందాలని అన్నారు.
మిల్లర్లు కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ధాన్యం సేకరణ, బియ్యం సరఫరా సక్రమంగా జరుగుతుందని ఆయన అన్నారు. సి.ఎం.ఆర్ లక్ష్యాలను సాధించడం చాలా
ముఖ్యమని, ప్రభుత్వానికి సహకరించడం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడగలరని కలెక్టర్ తెలిపారు. సి ఎం ఆర్
లో పాల్గొనే ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా రెండు వేర్వేరు రిజిస్టర్లను నిర్వహించాలని అన్నారు. ఏ సమయంలోనైనా పరిశీలనకు అందించాలని పేర్కొన్నారు. దాన్యం కోనుగోలు గురించి మాట్లాడుతూ ట్యాగ్ చేయని కొనుగోలు కేంద్రాల నుండి దాన్యం స్వీకరించొద్దని, కేటాయించిన మేరకు మాత్రమే దాన్యం స్వీకరించాలని తెలిపారు. సన్న రకం, దొడ్డు రకంలో జాగ్రత్తలు పాటించాలని, టోకెన్ కేటాయించాలని తెలిపారు. ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయడానికి తగినంత స్థలంతో పాటు దిగుమతి చేసేందుకు హమాలీలను ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డిఎం రాములు, మార్కెటింగ్ డిఎం కనక శేఖర్, సహకార అధికారి వాలియా నాయక్, రైస్ మిల్లర్లు సంగం అధ్యక్షులు తిరుపతి, రైస్ మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు.