పత్తి కొనుగోళ్లపై ఆరా తీసిన కలెక్టర్
Collector inquired about cotton purchases
నల్గోండ
పత్తి రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర 7521 /- కన్నా తక్కువగా అమ్ముకోవాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి మండలం, చౌడంపల్లి లో ఉన్న వరలక్ష్మి కాటన్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి పత్తి కొనుగోళ్లపై ఆరా తీశారు .ఇప్పటివరకు కాటన్ మిల్ కు వచ్చిన పత్తి, ప్రస్తుతం మిల్లులో ఉన్న పత్తి, తేమశాతం తనిఖీ చేశారు. మిల్లుకు పత్తి తెచ్చిన రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం భారత పత్తి సంస్థ ద్వారా ప్రకటించిన కనీస మద్దతు ధర 7521 /- వచ్చే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ, మార్కెటింగ్ ,సీసీఐ, అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. రైతులు సుమారు అయిదారు నెలలు కష్టపడి పత్తి పంటను పండిస్తారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను పొందేందుకు పత్తి రైతులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. నల్గొండ జిల్లాలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 22 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ,రైతులు తేమ ఎక్కువగా లేకుండా పత్తిని ఆరబెట్టి తేమశాతం 12 కు మించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. అలాగే పత్తి నాణ్యత తో ఉండాలని, రంగు మారకుండా, వర్షానికి తడవకుండా చూడాలని, పత్తిని రైతులు లూజుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు .12 శాతానికి మించి తేమ ఉన్నట్లయితే మద్దతు ధర రాదని, అందువలన రైతులు పత్తిని పొలం నుంచి తెంపిన తర్వాత నేరుగా కాటన్ మిల్లులకు తీసుకురాకుండా ఆరబెట్టి తీసుకురావాలని చెప్పారు.ఈ విషయంపై మార్కెటింగ్ ,వ్యవసాయ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు . ప్రస్తుతం వర్షాలు ఉన్నందున పత్తిని ఆరపెట్టడం ఇబ్బంది అనిపించినప్పటికీ, ఈనెల 26 వరకే వర్షాలు ఉన్నాయని, ఆ తర్వాత లేవని అందువల్ల పత్తిని ఆరబెట్టి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు .ఈ విషయంపై సంబంధిత శాఖల అధికారులు పత్తి రైతులకు మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని , పత్తి రైతులు మద్దతు ధర పొందేందుకు పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలపై ఒకటికి రెండుసార్లు తెలియజేయాలని చెప్పారు. ఏనుగులదోనికి చెందిన రైతు ధనుంజయ్ తాను 20 క్వింటాళ్ల పత్తిని తీసుకురావడం జరిగిందని, ప్రతిరోజు వర్షం కురుస్తున్నందున తేమ ఎక్కువగా ఉన్నందున పత్తిని ఆరబెట్టేందుకు అవకాశం లేనందున కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మార్కెటింగ్, వ్యవసాయ, సీసీఐ, రెవెన్యూ అధికారులందరూ రైతులకు మద్దతు ధర వచ్చేందుకే పని చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చౌడంపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ ఉన్న ధాన్యం రాశులను పరిశీలించడమే కాకుండా, తేమశాతాన్ని తేమ కొలిచే యంత్రం ద్వారా పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఎప్పుడొచ్చారని ?ఎన్ని క్వింటాళ్ళు తెచ్చారని ?అడిగి తెలుసుకున్నారు. ఈనెల 26 వరకు వర్షాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు లేనప్పుడు వరి ధాన్యాన్ని ఆరబెట్టి వెంటనే అమ్మాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నార్కెట్ పల్లి లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి సరఫరా చేసిన గన్ని బ్యాగులు, తూకం కొలిచే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, లారీలు తదితర వివరాలన్నీ ఆరా తీశారు .వర్షానికి ధాన్యం తడవకుండా ఎప్పుడు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం కొనుగోలుకు వచ్చిన కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ సిపిఓ కృష్ణారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, వరలక్ష్మి కాటన్ మిల్లు యాజమానులు శ్రీధర్ రెడ్డి, కల్పన,ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు



