Sunday, September 8, 2024

ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్

- Advertisement -

ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్న కాంగ్రెస్
రాహుల్ గాంధీ కోసం బిల్డర్లను బెదిరిస్తున్నది: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నదని అన్నారు. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కర్నాటక నుంచి సూట్ కేసులు వస్తే.. ఇప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయని విమర్శించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ నాయకులు వెళ్లల రామ్మోహన్ తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది కానీ అమలు చేయడం లేదు. ఢిల్లీకి సూట్ కేసులను మోసే పనిలో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక నుంచి ఇక్కడికి సూటు కేసులు వచ్చాయి. రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో బిల్డర్ల దగ్గర, కంపెనీలు, కాంట్రాక్టర్లను కాంగ్రెస్ బెదిరిస్తున్నది. ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతాయి కానీ.. ఆరు గ్యారంటీల అమలు లేదు. మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ లా కాదు.. చేసేదే చెప్తుంది.. చెప్పేది చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన పీవీ నర్సింహారావును మోదీ ప్రభుత్వం గౌరవించింది. పీవీ చనిపోతే.. ఆయన పార్థీవ దేహాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి అప్పటి కాంగ్రెస్ పార్టీ రానియ్యలేదు. ఆయనకు స్మృతి వనం నిర్మించలేదు. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించనీయలేదు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ కు పంపిన చరిత్ర కాంగ్రెస్ ది. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినా.. మోదీ ప్రభుత్వం పీవీ సేవలను గుర్తించి ఆయనకు భారత రత్న ఇచ్చింది”అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే అని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘ఈ రెండు అవినీతి, కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పంచన చేరుతాయి. బుజ్జగింపు రాజకీయాలు చేస్తాయి. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మీద దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీ కాబట్టి. సీబీఐతో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తే.. విజిలెన్స్ పేరుతో కాలయాపన చేస్తున్నది. విజిలెన్స్ తో అయ్యేది లేదు.. పోయేది లేదు. కాంగ్రెస్ చెయ్యి బస్మాసుర హస్తం.. చేయ్యి గుర్తుకు ఓటేస్తే.. అదే చెయ్యిని ప్రజల తలపై పెట్టి మోసం చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక వారు జీహెచ్ఎంసీ ముందు ధర్నా చేసే దుర్మార్గ స్థితికి తీసుకువస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరింత దిగజార్చనుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా.. జీహెచ్ఎంసీకి నిధులు ఇవ్వడం లేదు”అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
మోదీతోనే తెలంగాణ అభివృద్ధి
గత తొమ్మిదన్నరేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘రూ.400 కోట్లతో చర్లపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్, రూ. 450 కోట్లతో కాచిగూడ, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్లను మోదీ ప్రభుత్వం. ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ కానుంది. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలంటే మోదీ నాయకత్వం.. బీజేపీ నాయకత్వం అవసరం. భద్రాద్రి అభివృద్ధికి రూ.50 కోట్లు ఇచ్చారు. వరంగల్ రామప్ప దేవాలయానికి మోదీ కృషితో యునెస్కో గుర్తింపు వచ్చింది. జోగిలాంబ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో లక్షా 20 వేల కోట్ల రూపాయల విలువైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ ఆర్ రోడ్డును మోదీ మంజూరు చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ఇది గేమ్ చేంజర్ కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీది”అని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
దేశంలో ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘నిత్యం ఉగ్రవాదుల బాంబులతో రావణకాష్ఠంలా మండే కశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తేసి.. అక్కడ శాంతి నెలకొల్పిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయి. హైదరాబాద్ లో ఒకప్పుడు బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల చేతిలో పలువురి హత్యలు జరిగేవి. మోదీ వచ్చిన తర్వాత ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. పాక్ లో ఇండియన్ కరెన్సీ ముద్రించి భారత్ లో చెలామణి చేసేవారు. ఇప్పుడు అది ఆగింది. ప్రపంచం దృష్టిలో పాక్ ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిది. రొట్టె ముక్క కోసం ఇప్పుడు పాకిస్తా న్ లో ప్రజలు కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదులు దేశంలో దాడులు చేస్తే.. ప్రభుత్వాలు మౌనంగా ఉండేవి. కానీ మోదీ అలా కాదు.. దేశంలో దాడులు జరిపిన టెర్రరిస్టులను గుర్తించి సర్జికల్ స్ట్రైక్ లు, ఎయిర్ స్ట్రైక్ లు చేసి వారిని మట్టుబెట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారు. తొమ్మిన్నర ఏండ్ల మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. వచ్చే 25 ఏండ్లలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా భారత్ ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అందులో భాగస్వామ్యం అయ్యేందుకు మనం సిద్ధమవ్వాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్