కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్
కూకట్పల్లి : అక్టోబర్31(వాయిస్ టుడే): కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ, సిబిసిఐడి కాలనీ, ఐఆర్ఎస్ఏ కాలనీ, ఐడిపీసీ కాలనీలో మంగళవారం పాదయాత్ర నిర్వహిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి రమేష్ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ దర్శనమిస్తున్నాయి తప్ప బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామానికి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా అందించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. ప్రతి గ్రామానికి రోడ్లు, బస్సు సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందే ప్రతి గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సౌకర్యం కల్పించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఎన్నో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు అండగా నిలిచిందని, గరీబ్ కొ హటాఓ అనే నినాదంతో బ్యాంకులను జాతీయం చేసిందనీ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.

మహిళలకు మహాలక్ష్మి అనే పథకంపేరిట ప్రతినెల రూ. 2500 రూపాయలు, రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, అదేవిధంగా రైతులకు అండగా నిలవడం కోసం రైతుభరోసా అనే పథకాల పేరుట ప్రతి సంవత్సరం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి రూ. 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు రూ. 12,000, వరి పంటకు రూ. 500 రూపాయలు బోనస్ గా ఇస్తామని తెలియజేశారు. గృహ జ్యోతి అనే పథకం పేరిట ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం పేరిట రాష్ట్రం మొత్తం ఇల్లు లేని వారికి ఇంటి స్థలం లేదా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని,
అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం అందిస్తామని హామీ ఇచ్చారు. యువ వికాసం అనే పథకం పేరిట విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు మరియు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తామని, చేయూత అనే పథకం కింద నాలుగు వేలు నెలవారి పెన్షన్లు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు నేరుగా అందించే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రవేశపెట్టారని ప్రజలకు తెలియజేశారు.



