బ్యాంకర్లు నిబంధనలు పాటించాలి..
రైతు ఇబ్బందులు పడకుండా చూడాలి..
జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు రుణమాఫీ
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
రుణమాఫీ అంశంపైబ్యాంకర్లతో సమన్వయ సమావేశం
కరీంనగర్
Coordination meeting with bankers on the issue of loan waiver
రైతు రుణమాఫీ అంశంలో బ్యాంకర్లు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.గురువారం కరీంనగర్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు సంబంధించిన 37,745 బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 194.64 కోట్లు జమ చేయనుందని తెలిపారు. రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు. రైతు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని రైతు రుణమాఫీని వర్తింపజేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుకుండా బ్యాంకర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా బ్యాంకుల్లో రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎంక్వయిరీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రైతులతో మర్యాదగా వ్యవహరించాలని, నిర్లక్ష్యంగా సిబ్బంది సమాధానాలు ఇవ్వవద్దని సూచించారు. లేనిపోని అపోహలు సృష్టించేలా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాల యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రుణమాఫీ ఫై రైతుల అనుమానాలను వృత్తి కల్పించేందుకు, సూచనలు, సలహాలు అందించేందుకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు సలహాలు అందించాలని చెప్పారు. రైతుల రద్దీ ఏర్పడనున్న దృష్ట్యా బ్యాంకుల్లో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎల్డిఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి బత్తుల శ్రీనివాస్, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణ రావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.



