సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత

- Advertisement -

సీపీఎం నేత సీతారాం ఏచూరి కన్నుమూత

CPM leader Sitaram Yechury passes away
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12, (న్యూస్ పల్స్)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు.తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన 25 రోజులుగా చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల ఏచూరి సీపీఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గౌరి నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఇన్‌ఫెక్షన్‌ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్‌ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో సర్వేశ్వర సోమయాజులు ఏచూరి – కల్పకం ఏచూరి దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్ లోనే జరిగింది. హైదరాబాద్ లో 10వ తరగతి వరకూ చదువుకున్న సీతారాం.. ఆ తర్వాత ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్) చదివారు. జేఎన్ యూలో ఎంఏ (ఎకనామిక్స్) చేశారు.1974లో సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జేఎన్ యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికైన ఆయన.. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 3 సార్లు జేఎన్ యూ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1999లో పోలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. జేఎన్ యూ ను వామపక్షాల కంచుకోటగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.2005లో సీతారాం ఏచూరి తొలిసారి బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. 2015, 2018, 2022 సంవత్సరాల్లో వరుసగా సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్య సభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular