అప్పుడు ఆనకట్టలు కట్టలేదు…ఇప్పుడు నీళ్లు ఆపడం లేదు
-కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరంపై విషం చిమ్ముతుండ్లు
-పార్వతీ బ్యారేజి గేట్లు ఎందుకు ఎత్తిండ్లో జవాబు చెప్పాలే
-లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలు చేస్తాండ్లు
-ఈనాడు గోదారమ్మ గోడు కాంగ్రెస్సోళ్లకు కనబడుతలేదా
-పార్వతి బ్యారేజ్ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
Dams were not built then...now the water is not being stopped - Former MLA Putta Madhukar visits Parvati Barrage
మంథని
40ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గోదావరినదిపై ఆనకట్టలు కట్టాలనే ఆలోచన చేయలేదని, ఈనాడు అధికారంలో ఉండి వృధాగా పోతున్న నీటిని ఆపాలని చూడటం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీని గోదావరి విలాపం అనే పేరుతో స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ బారీ వర్షాలు పడి ఎగువనుంచి బారీగా వరదనీరు చేరి గోదావరినది నిండుగా ప్రవహిస్తోందని, నీళ్లు వృధాగా పోతుంటే గోదావరిననది కన్నీరు పెట్టుకుంటుందన్నారు. ఈనాడు లక్షల క్యూసేక్కుల నీళ్లు వృధాగా ఉప్పు నీళ్లలో కలిపేస్తున్నారని, తనను ఎవరికి ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరిమాత గోస వెల్లబోసుకుంటుందన్నారు. ఆనాడు ప్రకృతికి విరుద్దంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రివర్స్ పంపింగ్ చేసి నీటిని పైకి తీసుకువస్తే శాపం తగులుతుందని అనుకున్నా కానీ నేడు నీళ్లన్ని వృధాగా పోయి సముద్రంలో కలుస్తుంటే ఆనాడు కేసీఆర్ చేసిన ఆలోచన ఎంతో గొప్పదని గోదావరినది చెప్తోందన్నారు. నీళ్లు వృధా పోతున్నా ఆపాలనే ఆలోచన చేయకుండా ఇటు రైతులకు, ప్రజలకు ఉపయోగపడకుండా చేస్తున్నారని గోదావరినది మొరపెట్టుకుంటుందని, కళ్లున్న కాంగ్రెస్ నాయకులకు గోదావరినది గోస కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఆనాడు సాధ్యం కాదనుకున్న ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కన్నీళ్లు తుడిచిన కేసీఆర్పై, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపితే ప్రాజెక్టు కట్టినోళ్లకు పేరు వస్తుందనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ దెబ్బతిందని చెప్తున్నారని, కానీ పార్వతీ బరాజ్కు ఎలాంటి ఇబ్బంది లేకున్నా గేట్లు ఎత్తి నీళ్లను ఎందుకు వృధా చేస్తున్నారో జవాబు చెప్పాలన్నారు. ఒక ప్రాంతానికి పరిశ్రమనో ప్రాజెక్టు వస్తే దానిలో ఏదైనా సమస్య ఉంటే అక్కడి నాయకులు సరిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలే తప్ప దానిని పూర్తిగా పనికి రాకుండా చేయవద్దని హితవుపలికారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి ఇప్పటికైనా వృధాగా పోతున్న గోదావరినీళ్లను ఆపి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. సిరిపురం బరాజ్లో నీటిని ఆపితే ఈప్రాంతంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, గ్రౌండ్ వాటర్ పెరిగి వేసవి కాలంలోసైతం నీటి సమస్య తీరుతుందని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మత్య్సకారులకు సైతం ఉపాధి మెరుగుపడుతుందని, ప్రభుత్వం ఈ ప్రాంత పాలకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు యెగోళపు శంకర్ గౌడ్,గుజ్జుల రాజిరెడ్డి, ఆరేపల్లి కుమార్,తగరం శంకర్ లాల్, మిర్యాల ప్రసాదరావు, కాయితి సమ్మయ్య, మాచిడి రాజు గౌడ్, కొండ రవీందర్, కనవేణ శ్రీనివాస్ యాదవ్, ఇర్ఫాన్, అసిఫ్ ఖాన్, పోలు కనుకరాజు లతో పాటు పలువురు పాల్గొన్నారు.



