అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్, మార్చి 23
Democracy is Being Murdered Through Illegal Arrests:
Union Minister Kishan Reddy Slams
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని అడ్డుకోవడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు సీనియర్ నేతలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ఖండించారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసు బలగాలతో అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? లేక పోలీసులతో పాలన సాగిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కూడా కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే అరెస్టులు చేయడం వారి అభద్రతాభావాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.అధికారంలోకి రావడం కోసం పచ్చి అబద్ధాలతో ప్రజలను నమ్మించి, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, యువత, మహిళలు తమకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఉలిక్కిపడుతోందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజా సంక్షేమం కంటే కమిషన్ల వసూళ్లపైనే మక్కువ ఎక్కువగా ఉందని ఘాటుగా విమర్శించారు.అరెస్టులు, లాఠీచార్జీలతో బీజేపీ పోరాటాన్ని అణచివేయలేరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి నిలదీయడం తమ బాధ్యత అని, అవినీతి మరియు అసమర్థ పాలనను గద్దె దించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం అని ఆయన ప్రకటించారు. ప్రజలు ప్రభుత్వంపై విసిగిపోయి ఉన్నారని, త్వరలోనే ప్రజాగ్రహం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.



