ఖమ్మం, డిసెంబర్ 13, (వాయిస్ టుడే): ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుపై కాంగ్రెస్ పార్టీ కన్ను పడింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఊహించని విధంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్న పరిస్థితి సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 54 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాలోని రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ తో పాటు సుడా ఛైర్మన్ పదవులు కూడా రద్దయ్యాయి. అలాగే తాజాగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుపై కూడా కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్లు తెలుస్తోంది. కో ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో డీసీసీబీ పాలకవర్గంలో అవిశ్వాసం ప్రవేశపెట్టి పాలకవర్గాన్ని రద్దు చేయించే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలక పదవులు ఖమ్మం జిల్లాకు దక్కడంతో కేబినెట్ లో జిల్లా మంత్రులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడంతో నామినేటెడ్ పదవులను తమ అనుయాయులకు ఇప్పించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 మార్చి నెలలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గం ఏర్పడింది. ఛైర్మన్ గా కూరాకుల నాగభూషయ్య కొనసాగుతున్నారు. కాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ కుమార్ కు అత్యంత సాన్నిహిత్యం నేపథ్యంలో కూరాకుల నాగభూషయ్యను డీసీసీబీ ఛైర్మన్ పదవి వరించింది. 2020లో ఏర్పడిన పాలకవర్గం నిబంధనల ప్రకారం 2025 వరకు కొనసాగే వీలుంది. కానీ పాలకవర్గం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత అవిశ్వాసం ప్రవేశపెట్టి పాలకవర్గాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గాన్ని అవిశ్వాసంతో పడగొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరగబోయే పాలకవర్గ సమావేశాన్ని ఇందుకు వేదికగా మలచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కూరాకుల నాగభూషయ్య నేతృత్వంలోని పాలకవర్గం ఏర్పడి మూడేళ్ల కాలం పూర్తవడంతో ఆ పాలకవర్గాన్ని అవిశ్వాసంతో కూలదోసేందుకు కాంగ్రెస్ అన్ని రకాలుగా సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ఇదే నిజమైతే పాలకవర్గ సమావేశం అవిశ్వాస తీర్మానానికి వేదిక కానుంది.



